(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివాసీలతో కలసి స్టెప్పులేశారు. ఛత్తీస్గఢ్లో జరిగిన రాష్ట్రీయ ఆదివాసీ మహోత్సవ్లో పాల్గొన్న రాహుల్.. ఆదివాసీల సంప్రదాయ వేషధారణలో వారితో కలసి డప్పుకొడుతూ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జాతీయ గిరిజన నృత్యోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గిరిజన నృత్యోత్సవ వేడుకల సందర్భంగా వేదికను అలంకరించిన రాహుల్.. కాసేపు ఆదివాసీ గెటప్లో దర్శనమిచ్చారు. ఆదివాసీల డోలును వాయిస్తూ వేదికపై కలియదిరిగారు.
#WATCH Chhattisgarh: Congress leader Rahul Gandhi takes part in a traditional dance at the inauguration of Rashtriya Adivasi Nritya Mahotsav in Raipur. pic.twitter.com/HpUvo4khGY
— ANI (@ANI) December 27, 2019
ఈ నృత్యోత్సవాలు డిసెంబర్ 29వ తేదీ వరకు కొనసాగున్నాయి. దేశంలోని 25 రాష్ట్రాలతోపాటు ఆరు దేశాలకు చెందిన మొత్తం 1350 మంది నృత్యకారులు ఈ వేడుకల్లో పాల్గొంటారని ప్రభుత్వ తెలిపింది. ఇరవై తొమ్మిది గిరిజన కళా బృందాలు నాలుగు వేర్వేరు నృత్య రూపాలలో 43కి పైగా శైలిలో ప్రదర్శించనున్నాయి. తెలంగాణ గిరిజనులు గుస్సాడీ నృత్యాన్ని, ఏపీ గిరిజనులు థింసా నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. డిసెంబర్ 28న గుజరాత్ కళాకారులు వాసవ నృత్యం, ఆంధ్రప్రదేశ్ కళాకారులు థింసా నృత్యం, త్రిపుర కళాకారులు మమితా నృత్యం చేయనున్నారు. కార్యక్రమం యొక్క మూడవ రోజు ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, సిక్కిం తదితర రాష్ట్రాల కళాకారులు నృత్యం చేయనున్నారు. అంతేకాదు ఉగాండా, మాల్దీవులు, బంగ్లాదేశ్, బెలారస్, శ్రీలంక, థాయ్లాండ్ దేశాల నుంచి నృత్యకారుల బృందాలు ఈ వేడుకల్లో పాల్గొననున్నాయి.