ఢిల్లీ: తనపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. తన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార వేడిలో తాను ఈ వ్యాఖ్యలు చేశానని రాహుల్ తెలిపారు. తన వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీలు వాడుకోవాలని చూస్తున్నాయని రాహుల్ వివరించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.
రఫేల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. ‘దేశం మొత్తం చౌకీదారే దొంగ అంటోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా న్యాయం గురించి మాట్లాడింది’ అని వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై బిజెపి ఎంపి మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పునకు రాహుల్ తన సొంత ఆరోపణలు ఆపాదిస్తున్నారనీ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనీ పిటిషన్లో పేర్కొన్నారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్కు నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీ అన్నట్లుగా తాము ఎప్పుడూ వ్యాఖ్యానించలేదనీ, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించలేదనీ కోర్టు పేర్కొంది. దీనిపై ఏప్రిల్ 22లోగా రాహుల్ సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నేడు సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చారు.