అమేఠీ: ఉత్తరప్రదేశ్లోని అమేఠీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ వెంట ఆయన కుటుంబ సభ్యులు యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా తదితరులు ఉన్నారు.
రాహుల్ గాంధీ నామినేషన్కు ముందు నగరంలో భారీ రోడ్షో నిర్వహించారు. వందలాది మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నడుమ రాహుల్ కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా చేరుకున్నారు.
అమేఠీ గాంధీ ఫ్యామిలీకి కంచుకోట. అమేఠీ నుంచి రాహుల్ గాంధీ వరుసగా మూడు సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. అమేఠీలో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో తలపడనున్నారు. గత ఎన్నికల్లో స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ ఒక లక్ష పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్లోని అమేఠీతో పాటు వయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత వారం వయనాడ్లో రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు.
వయనాడ్లో కూడా కాంగ్రెస్కు మంచి పట్టుంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎంఐ షానావాస్ ఇక్కడ విజయం సాధించారు. అయితే ఈసారి అమేఠీతో పాటు దక్షిణాది నుంచి కూడా పోటీ చేయాలన్న పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు రాహుల్ వయనాడ్ను రెండవ లోక్సభ నియోజకవర్గంగా ఎంచుకున్నారు. సిపిఐ నేత పిపి సునీర్, ఎన్డిఏ అభ్యర్థి తుషార్ వెల్లపల్లితో ఇక్కడ రాహుల్ తలపడనున్నారు.
ఏప్రిల్ 23న వయనాడ్లో, మే ఆరున అమేఠీలో పోలింగ్ జరగనున్నది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.