న్యూఢిల్లీ: మీరు తప్ప గత్యంతరం లేద అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రాధేయపడుతున్నప్పటికీ రాజీనామా విషయంలో రాహుల్ గాంధీ పట్టు వీడడం లేదు. ఈ విషయంలో ఆయనకు సోదరి ప్రియాంకా గాంధీ కూడా మద్దతుగా నిలిచిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయానిక నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని రాహుల్ శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రతిపాదించారు. అయితే సిడబ్ల్యుసి ఏకగ్రీవంగా ఆయన ప్రతిపాదనను తిరస్కరించింది. ప్రస్తుత క్లిష్ట స్థితిలో పార్టీకి ఆయన మార్గదర్శనం అవసరమని స్పష్టం చేసింది.
నాలుగు గంటలసేపు జరిగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పార్టీ సీనియర్లతో నిర్మొహమాటంగా మాట్లాడినట్లు తెలిసిందని ఎన్డిటివి పేర్కొన్నది. సీనియర్ నాయకులు తమ వారసులను పార్టీపై రుద్దడం గురించి ఆయన మాట్లాడినట్లు తెలిసింది. పార్టీని సంపూర్ణంగా పునర్వ్యవస్థీకరించేందుకు సిడబ్ల్యుసి ఆయనకు పూర్తి అధికారం ఇచ్చింది. మీరు కాకపోతే పార్టీని నడిపేవారు ఇంకెవరున్నారని కొందరు ప్రశ్నించినట్లు తెలిసింది. మరి కొందరు ప్రియాంకా గాంధీ పేరు ప్రస్తావించినపుడు, రాహుల్ ఆమెను ఇందులోకి లాగవద్దని స్పష్టంగా చెప్పారు.
సమావేశంలో సీనియర్ నేత పి.చిదంబరం ఉద్వేగంగా మాట్లాడారు. రాహుల్ తప్పుకుంటే దక్షిణాదిన పార్ట కార్యకర్తలకు ప్రాణత్యాగమే గతి అని ఆయన అన్నట్లు తెలిసింది. ఆధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నంత మాత్రాన తాను ఎక్కడికీ వెళ్లననీ, పార్టీ కోసం పనిచేస్తూనే ఫుంటాననీ రాహుల్ అన్నారు.