విజయవాడ, మార్చి 31: కేంద్రంలోఅధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రజల హృదయాలను ఆకట్టుకునేందుకు పలు హామీలను ప్రకటిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ పాలనను తీవ్రస్థాయిలో విమర్శించారు.
యావత్ భారతదేశం తరపున ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదాపై మాట ఇచ్చారు, ఐదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోది ఆ హామీని అమలు చేయలేదని రాహుల్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండ్రోజుల్లోనే రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఆ మూడు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రుణ మాఫీ చేసి చూపించామని రాహుల్ గాంధీ అన్నారు.
తాము అధికారంలోకి రాగానే పేదరిక నిర్మూలన కోసం సర్జికల్ స్ట్రైక్ చేస్తామని రాహుల్ పేర్కొన్నారు. మోదీ మాదిరిగా తాను అబద్దాలు చెప్పనని అన్నారు. వేల కోట్ల రూపాయలు బడా పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేసిన మోది ప్రభుత్వం రైతుల రుణ మాఫీ చేయడం లేదని రాహుల్ అన్నారు. జిఎస్టి పేరుతో మోది ప్రభుత్వం గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధిస్తుందని రాహుల్ విమర్శించారు.
హామీల అమలు కోసం ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ పార్టీలు మోదిపై గట్టిగా ఒత్తిడి చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాహుల్ అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉంటామనీ, ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు ఒక దిక్సూచిలా నిలవాలని కోరుకుంటున్నామని రాహుల్ అన్నారు. ఎపి దేశంలోనే ఒక ఆధునిక రాష్ట్రంగా రూపుదిద్దుకునేందుకు అండగా ఉంటామని రాహుల్ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్ అవినీతిపరుడు అంటూ రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ఆయన అనేక అవినీతి కేసులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఎపికి జగన్ వంటి అవినీతిపరుడు అవసరం లేదని రాహుల్ అన్నారు.
ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనీ, నిరుద్యోగుల ఆర్థికాభివృద్ధికి రుణాలు ఇప్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో మౌళిక సదుపాయాలు మెరుగుపర్చి అగ్రగామి రాష్ట్రంగా తీసుకువస్తామని రాహుల్ అన్నారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని రాహుల్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు రక్షణ ఇస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలు. దళితులు, మైనార్టీలకు మోది ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ రోహిత్ వేముల ఉదంతాన్ని గుర్తు చేశారు. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 72వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను విజయం చేకూర్చాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.
సభలో పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పార్టీ ముఖ్యనేతలు, అభ్యర్థులు పాల్గొన్నారు.