న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా అయిదేళ్లలో మొదటి విలేఖరుల సమావేశంలో పాల్గొని ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రం విసిరారు.
‘అభినందనలు మోదీజి. గొప్ప ప్రెస్ కాన్ఫరెన్స్. రావడమే సగం పోరాటం. వచ్చేసారి అమిత్ షా మీకు కూడా రెండు ప్రశ్నలకు సమాధానమిచ్చే అవకాశం కల్పించవచ్చు. బాగుంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
Congratulations Modi Ji. Excellent Press Conference! Showing up is half the battle. Next time Mr Shah may even allow you to answer a couple of questions. Well done! ?
— Rahul Gandhi (@RahulGandhi) May 17, 2019
సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్కు ప్రచారం ముగిసిన తర్వాత శుక్రవారం సాయంత్రం బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి ప్రధాని మోదీ బిజెపి కేంద్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశానికి వచ్చారు. ప్రధానిగా గత అయిదేళ్లలో ఇది ఆయనకు మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్. అయితే ఆయన ముందు ఒక ప్రకటన చేసిన తర్వాత మౌనంగా కూర్చున్నారు. ఆయన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం మీడియా ప్రతినిధులకు తీవ్రమైన నిరాశ కలిగించింది. తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తననీ, తనకు పార్టీ అధ్యక్షుడే సర్వమనీ అంటూ ఆయన ప్రశ్నలను తప్పించుకున్నారు. అమిత్ షా కూడా ‘నేను మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చానుగా. ప్రధాని అన్నిటికీ జవాబు చెప్పాలని లేదు’ అంటూ మోదికి వత్తాసు పలికారు.
మోదీ విలేఖరుల సమావేశంలో కూర్చున్న సమయంలోనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. మోదీ మీడియా సమావేశం గురించి ప్రస్తావిస్తూ, ‘అపూర్వమైన సంఘటన. కొంతమంది జర్నలిస్టులను లోపలికి రానివ్వలేదని విన్నాను.నేను ఇక్కడి నుంచే ప్రధానిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. రఫేల్ ఒప్పందం విషయంలో నా ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానం ఇవ్వలేదు’ అని రాహుల్ అన్నారు.