ఢిల్లీ: ‘కాఫీ విత్ కరణ్’ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, బ్యాట్స్మెన్ కెఎల్ రాహుల్లకు బిసిసిఐ అంబుడ్స్మన్ జస్టిస్ డికె జైన్ చెరో 20 లక్షల రూపాయల జరిమానా విధించారు.
ఇందులో పది లక్షల రూపాయలు ‘భారత్ కే వీర్’ కు దరఖాస్తు చేసుకున్న వితంతువులకు పది మందికి లక్ష రూపాయల చొప్పున చెల్లించాలనీ, మిగిలిన పది లక్షల రూపాయలు అంధుల క్రికెట్ అసోసియేషన్ ప్రచారఖర్చుల నిమిత్తం విరాళంగా ఇవ్వాలని సూచించారు.
నాలుగు వారాల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని జైన్ ఆదేశించారు. ఒకవేళ చెల్లించకపోతే వారి మ్యాచ్ ఫీజులో కోత విధించి వసూలు చేస్తామని స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధంతరంగా వచ్చేసిన కారణంగా ఇప్పటికే ఈ ఇద్దరూ 30 లక్షల రూపాయలు చేజార్చుకున్నారని జైన్ అన్నారు. దేశంలో క్రికెటర్లను చాలా మంది రోల్ మొడల్గా తీసుకుంటారనీ, అలాంటి వారు నోరుజారడం మంచిది కాదని జైన్ హితవు పలికారు.
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారానికి దారి తీసింది.
తప్పును సరిదిద్దుకుని క్షమాపణలు చెప్పినా వీరు శిక్షను అనుభవించక తప్పలేదు. బిసిసిఐ వీరిద్దరిపై రెండు మ్యాచ్ల సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆస్ట్రేలియా టూర్ నుంచి వెనక్కి వచ్చేశారు.
అయితే వీరిద్దరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేశారు బిసిసిఐ అంబుడ్స్మన్ జస్టిస్ డికె జైన్. జస్టిస్ డికె జైన్ను బిసిసిఐ అంబుడ్స్మన్గా సుప్రీం కోర్టు నియమించింది.
కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ వరల్డ్ కప్ జట్టుకు సెలక్ట్ అయ్యారు. మే 30 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ ప్రారంభంకానున్నది.