ఢిల్లీ: కోర్టు దిక్కార కేసులో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ‘చౌకీదార్ చోర్ హై’ అని సుప్రీం కోర్టు అన్నట్లుగా గతంలో రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై బిజెపి ఎంపి మీనాక్షి లేఖీ కోర్టు దిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై స్పందించిన సుప్రీం కోర్టు రాహుల్ గాంధీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చౌకీదార్ వ్యాఖ్యలపై కోర్టును తప్పుదోవ పట్టిస్తారా అని రాహుల్ గాంధీపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ తరపు న్యాయవాదిపై న్యాయమూర్తి మండిపడ్డారు. తాము అలాంటి పదాలు ఎక్కడా వినియోగించలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రాహుల్ ఇప్పటి వరకూ క్షమాపణ ఎందుకు చెప్పలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ‘చింతించడం’ అనే పదం కోసం 22 పేజీల అఫిడవిట్ ఏమిటని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టు దిక్కారం కింద చర్యలు చేపడతామని రాహుల్ గాంధీని కోర్టు హెచ్చరించింది.
సుప్రీం కోర్టుకు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ క్షమాపణలు చెప్పారు. కోర్టును కించపరిచే ఉద్దేశం లేదనీ, క్షమాపణ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేస్తానని రాహుల్ గాంధీ సుప్రీంకు వివరణ ఇచ్చారు.