రాజస్థాన్ ముఖ్య మంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రంపై సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలెట్…అశోక్ గెహ్లట్ సర్కార్ పై తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. సచిన్ పైలట్ తన వర్గీయులతో బీజేపీలో చేరి అశోక్ గెహ్లట్ ప్రభుత్వాన్ని కూల్చి వేయనున్నారని ప్రచారం జరగడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభానికి గురిచేస్తున్నట్లుగా ఉన్న ఆడియో టేపులు రిలీజ్ కావడంతో సచిన్ పైలట్ ను ఉప ముఖ్యమంత్రి పదవి నుండి, పీసీసీ అధ్యక్ష పదవి నుండి తొలగించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల ప్రలోభానికి సంబందించి ఆడియో టేపుల వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, గెహ్లాట్ సర్కార్ పై బీజేపీ నేతలు ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేస్తూ ఆడియో టేపుల కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనితో సీఎం గెహ్లాట్ కేంద్రానికి షాక్ ఇచ్చేలా సంచలన నిర్ణయం తీసుకున్నది. ఏమిటా సంచలన నిర్ణయం అంటే రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని నిషేధిస్తూ గెజిట్ జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు. సీఎం గెహ్లాట్ నిర్ణయం కేంద్రానికి షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఆడియో టేపులపై విచారణ ను సిబిఐకి అప్పగించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధం అవుతున్న తరుణంలో గెహ్లాట్ ఈ సరికొత్త అస్త్రాన్ని తీసుకువచ్చారు.
గతంలో ఏపి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో సిబిఐని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ దోస్తాన్ కటీఫ్ అయిన తరువాత టీడీపీ నాయకులపై సీబీఐ.. ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు.. ఏపిలో సిబిఐకి నిషేధం విధించారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నిషేధాన్ని ఎత్తివేసి సిబిఐకి ద్వారం తెరిచారు. కాగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు సీబీఐని నిషేధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ జాబితాలో ఇప్పుడు రాజస్థాన్ కూడా చేరింది.