జైపూర్: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్.. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, పంజాబ్ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేయగా.. ఇప్పుడు రాజస్థాన్ కూడా అదే దారిలో వెళ్లింది. అయితే సభలో తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో.. అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు. సీఏఏను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేరళ, పంజాబ్ తరువాత సీఏఏ వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించిన మూడవ రాష్ట్రం రాజస్థాన్ నిలిచింది. అంతకుముందు రాజస్థాన్ కేబినెట్ సీఏఏ వ్యతిరేక ప్రతిపాదనను ఓ సర్క్యులేషన్ ద్వారా ఆమోదించింది. ఈ చట్టాన్ని తమ ప్రభుత్వం అమలు చేయబోదని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
సీఏఏను నిరసిస్తూ దేశంలో అనేక రాష్ట్రాల్లో పెద్దఎత్తున హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం 2019ని అమలు చేయబోమని కేరళతోపాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీశ్గఢ్ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. అసోంలో కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టాన్ని రూపొందించారని, ఇది రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాదం, సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు, చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి 22న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, పిటిషనర్ల తరుపున కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. సీఏఏపై ఇప్పట్లో ఎలాంటి స్టే ఇవ్వబోమని తెలిపింది. సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన కొత్త పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయంపై అప్పటివరకు హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్టవద్దని, ఉత్తర్వులు ఇవ్వద్దని ఆదేశాలు జారీ చేసింది. సీఏఏపై వచ్చిన పిటిషన్లపై విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అంశంపై ఐదు వారాల తర్వాత విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అసోం, త్రిపురకు సంబంధించిన పిటిషన్లను మాత్రం వేరుగా విచారిస్తామని సుప్రీంకోర్టు వివరించింది.
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లలో మత పరమైన పీడనకు గురైన అక్కడి మైనార్టీలకు భారత్ లో పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో రూపొందించిన చట్టానికి గతేడాది డిసెంబర్ లో పార్లమెంటు ఆమోదం తెలిసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సి), జాతీయ జనాభా జాబితా (ఎన్పిఆర్)లను నిరసిస్తూ… దేశ వ్యాప్తంగా ముస్లింలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ 31న కేరళ అసెంబ్లీ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని అధికార సీపీఐ (ఎం)-ఎల్డీఎఫ్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ సమర్థించాయి. అయితే బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. పౌరసత్వ చట్టం రద్దు తీర్మానాన్ని ఆమోదించేందుకు కేరళ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 31న ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశం నిర్వహించింది. అంతేకాదు సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏపై న్యాయస్థానంను ఆశ్రయించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. జనవరి 17న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. వివాదాస్పద సీఏఏను రద్దు చేయాలని పంజాబ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది.