న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్స్ కొత్త డ్రస్ కోడ్పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.అభ్యంతరాల నేపథ్యంలో డ్రెస్ కోడ్పై పునరాలోచన చేస్తామని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తెలిపారు.
రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా సోమవారం నుండి రాజ్యసభ మార్షల్స్కి కొత్త కోడ్ అమల్లోకి తెచ్చారు. గతంలో మార్షల్స్ సఫారీ దుస్తులు, తలపాగా ధరించే వారు. అయితే ఆధునిక రుపంతో పాటు, నేటి అవసరాలకు డ్రస్ కోడ్ మార్చాలని మార్షల్స్ కోరిన నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పలు దఫాలు చర్చించిన అనంతరం సైనిక అధికారుల నూతన డ్రస్కోడ్ని అమల్లోకి తెచ్చారు. అయితే దీనిపై మాజీ సైనికాధికారులతో సహా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
మిలిటరీ యూనిఫాంను మిలిటరీయేతర వ్యక్తులు ధరించడం చట్టవిరుద్ధమని, అంతే కాక భద్రత రీత్యా ప్రమాదకరమని మాజీ సైనికాధిపతి జనరల్ విపి మాలిక్ అన్నారు. దీనిపై రాజ్యసభ మారో సారి ఆలోచించి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. డ్రెస్ కోడ్ విషయంలో రాజ్యసభలో విపక్ష సభ్యులు కూడా ఆందోళన చేశారు. దీనిపై వెంకయ్య నాయుడు స్పందించారు. డ్రెస్ కోడ్ మార్పు నిర్ణయాన్ని పునః సమీక్షిస్తామని ఆయన చెప్పారు. ఈ వస్త్రధారణపై అనేక సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకున్న తరువాతే సెక్రటేరియట్ ఈ కొత్త డ్రెస్ కోడ్ తీసుకొచ్చిందని వెంకయ్య నాయుడు చెప్పారు.