అమరావతి:హైకోర్టు అమరావతిలోనే ఉండాలని కోస్తా న్యాయవాదులు కోరితే రాజధానిని రాయలసీమకు కేటాయించాలని ఆ ప్రాంత న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలంటే హైకోర్టును రాయలసీమకు తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు బుధవారం సచివాలయానికి చేరుకున్నారు. సిఎం జగన్ కాన్వాయ్ వెళుతుండగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు.హైకోర్టును రాయలసీమకు తరలించాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోకపోవడం పార్టీలకు అలవాటైందని వారు విమర్శించారు. శ్రీభాగ్ ఒప్పందం మేరకు హైకోర్టును రాయలసీమకు తరలించాలని డిమాండ్ చేశారు. సిఎం జగన్ను కలిసే వరకూ సచివాలయం నుండి వెళ్లేది లేదని రాజయసీమ న్యాయవాదులు స్పష్టం చేశారు.
మరో పక్క అమరావతి రాజధాని నుండి హైకోర్టును రాయలసీమకు తరలించడానికి వీలు లేదంటూ తొమ్మిది జిల్లాలలో బార్ అసోసియేషన్ నేతలు విధులను బహిష్కరించి నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.