తిరుమల: పార్టీ మార్పుపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తనకు పార్టీ మారే ఆలోచనేదీ లేదని, అయితే భవిష్యత్తులో ఉండొచ్చు అని ఆయన అన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ మారే అవకాశాలను తోసిపుచ్చలేనని వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. తన ఇళ్ళు, ఆఫీసులపై సీబీఐ సోదాలు చేసిన విషయంపై అయన స్పందించారు.
రెండు రోజుల క్రితం సీబీఐ అధికారులు తన ఇంటికి సోదాల కోసం వచ్చినప్పుడు తాను ఇంట్లో లేనని తెలిపారు. తనిఖీల తరువాత వారికి ఏమీ లభించలేదన్నారు. అదే విషయాన్ని చెబుతూ.. వారు తన ఇంటి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అసలు సీబీఐ కేసుతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని రాయపాటి స్పష్టం చేశారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వ్యవహారాలన్నీ సంస్థ సీఈవోనే చూసుకుంటున్నారని, తనకుగానీ, తన కుటుంబీకులకు గానీ ప్రమేయం లేదని చెప్పారు. ప్రస్తుతానికి టీడీపీని వీడే ఆలోచన తనకు లేదని రాయపాటి చెప్పారు.
మరోవైపు రాయపాటి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో చాలా కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగన రాయపాటి సాంబశివరావు.. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలో చేరారు. అనంతరం నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అంతకంటే ముందు కాంగ్రెస్ లో ఉంటూ సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేశారు. 2014-2019 మధ్య కాలంలో టీడీపీ ఎంపీగా లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్న రాయపాటి ఇళ్ళపైనా, ఆయన డైరెక్టర్గా వున్న ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఆఫీసులపై సీబీఐ దాడులు చేస్తోంది. పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాయపాటి ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం ఆయన బీజేపీలో చేరతారని వార్తలు బలంగా వినిపించాయి. అదేసమయంలో ఆయనకు బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని కూడా ప్రచారం జరిగింది. అయితే, రాయపాటి చేరికను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అడ్డుకుంటున్నారన్న వాదన కూడా ఉంది. రాయపాటికి, కన్నా కు మధ్య ఏళ్ల తరబడి రాజకీయ వైరం కొనసాగుతోంది. అయినా కూడా పార్టీకి ఉపయోగపడే వారు ఎవరు వచ్చినా చేర్చుకుంటామని ఇటీవలే కన్నా ప్రకటించారు. కానీ ఇంతవరకు రాయపాటికి అనుమతి రాలేదు. ఈ క్రమంలో తాజాగా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడంతో రాయపాటి పార్టీ మార్పు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. సీబీఐ దాడుల నేపథ్యంలో రాయపాటి బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.