(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
నవ్యాంధ్ర రాజధానిపై నివేదిక ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ, అమరావతి ప్రాంతం రాజధానికి సురక్షితం కాదని చెప్పిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తిరగదోడడం సంచలనం సృష్టించింది. రాజధానిని అమరావతి నుంచి ప్రకాశం జిల్లాలోని దొనకొండకు మారుస్తారని కేంద్రం లోని పెద్దల ద్వారా తెలిసిందని కాంగ్రెస్ నేత చింతా మోహన్ ప్రకటించడం దీనికి తోడయింది. విషయాన్ని సర్దేందుకు వైసిపి నాయకులు రంగంలోకి దిగారు గానీ, వారు కూడా రాజధాని మారదు అని ఢంకా బజాయించడం లేదు. రాజధాని మారుస్తామని బొత్స చెప్పలేదుగా అంటున్నారు, అంతే.
వైఎస్ జగన్ నాయకత్వంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడగానే అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మందగించింది. ఇప్పుడు మరింత ఇబ్బందికి గురవుతున్నది. ఇక్కడ ఇలా అయితే మరి దీనంతటికీ కేంద్రంగా ఉన్న దొనకొండలో పరిస్థితి ఏమిటి?s
కొద్ది రోజులుగా దొనకొండ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలకు సంబంధించి కదలికలు మొదలయ్యాయి. ప్రకాశం జిల్లా మొత్తం మీద ప్రస్తుతం రాజధాని మార్పు విషయంలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. నిజానికి దొనకొండ ప్రాంతంలో 2019 ఎన్నికల ఫలితాలు రాగానే భూముల ధరలలో కాస్త ఊపు కనబడింది. తాజాగా భూముల ధరలు పైకి చూస్తున్నాయి. దర్శి మాజీ శాసనసభ్యుడు శివప్రసాద రెడ్డి దొనకొండ ప్రాంతంలో భూములు కొన్నట్లు తెలిసింది.
మరికొందరు వైసిపి నాయకులు కూడా దొనకొండ ప్రాంతంలో భూములు కొంటున్నారని చెబుతున్నారు. మంగళగిరి, తెనాలి తదితర ప్రాంతాల నుంచి ఇతరులు కూడా ఆ ప్రాంతం వెళ్లి భూములు చూడడం మొదలయిందని స్థానికులు చెబుతున్నారు.
2014 ఎన్నికల ముందు దొనకొండ, ఆ చుట్టుపక్కల భూముల ధరలు పెరిగాయి. వైసిపి అధికారం సంపాదిస్తే దొనకొండ ప్రాంతంలో రాజధాని వస్తుందన్న నమ్మకం అందుకు కారణం. టిడిపి అధికారంలోకి రావడం, అమరావతి రాజధానిగా ప్రకటించడం తదితర పరిణామాలతో దొనకొండలో భూముల ధరలు పడిపోయాయి. ఎన్నికల ముందు 50 లక్షల రూపాయలు పలికిన ఎకరం భూమి ధర తర్వాత సగానికి సగం తగ్గిపోయింది.
నవ్యాంధ్రలో చంద్రబాబు ప్రభుత్వం అక్కడి భూముల్లో పారిశ్రామిక కారిడార్ ప్రకటించడంతో మళ్లీ కాస్త ఊపు వచ్చింది. దొనకొండలో భూమి ధర ఎకరానికి 30 లక్షల రూపాయల వరకూ, చుట్టుపక్కల భూముల ధరలు 10-15 లక్షల వరకూ పెరిగాయి. అక్కడ సుమారు 25 వేల ఎకరాల వరకూ ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు. పారిశ్రామిక కారిడార్ కోసం ఆ భూముల్లో 10 వేల ఎకరాల వరకూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి)కు కేటాయించారు కూడా.
2019 ఎన్నికల పోలింగ్కూ, కౌంటింగ్కూ మధ్య దొనకొండ భూములకు అకస్మాత్తుగా గిరాకీ పెరిగింది. ఎకరా 40 లక్షల వరకూ వెళ్లింది. ఇప్పుడు రాజధాని తరలింపు ఊహాగానాలతో మళ్లీ ధరలు రెక్కలు విప్పుకుంటున్నాయి. క్రయవిక్రయాలు అంతగా లేనప్పటికీ భూముల ధరలలో ఊపు కనబడుతోందని స్థానికులు చెబుతున్నారు. దొనకొండ ప్రాంతంలో బ్రిటిష్ జమానాలో నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ను కూడా ఎయిర్పోర్ట్స్ అధారిటీ అభివృద్ధి చేయనున్నది.