(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
మూలిగే నక్కపై తాటికాయ పడింది అన్న చందంగా తయారు అయింది రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి. కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేసింది. ఒక్కసారిగా ఈ మహమ్మారి విజృంభించడంతో కేంద్రం వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ ప్రకటించింది. అన్ని రంగాలు షట్డౌన్ కావడంతో ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగం పనులు ప్రారంభం అయ్యాయి.
పెరిగిన సిమెంట్, స్టీల్ ధరలు
దేశంలో లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ ఒక్క సారిగా సిమెంట్, స్టీల్ ధరలు 40 నుండి 50 శాతం పెరిగాయి. తయారీదారులు కుమ్ముక్కు కావడమే ధరలు పెరుగుదలకు కారణం అని ఆరోపణలు వస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సిమెంట్ బస్తా ధర రూ. 100ల నుండి రూ. 250ల వరకు పెంచి అమ్మకాలు చేస్తుండగా స్టీల్ ధర టన్నుకు రూ. 2 వేల నుండి రూ. 2500ల వరకూ పెరిగింది. లాక్ డౌన్ సాకుగా చూపి ధరలు ఇష్టానుశారంగా పెంచడానికి వీలులేదని పాలకులు హెచ్చరిస్తున్నా వాటిని వ్యాపారులు పెడచెవిన పెడుతున్నారు.
రియల్ ఎస్టేట్ రంగానికి పెనుభారం
కోవిడ్ 19 కారణంగా నిర్మాణ కార్యక్రమాలు ముందుకు సాగక, కార్మికులు అందుబాటులో లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ రంగానికి పెరిగిన సిమెంట్, స్టీల్ ధరలు పెనుభారంగా మారాయి.
కేంద్రానికి క్రెడాయ్ లేఖ
సిమెంట్, స్టీల్ ధరల పెరుగుదలపై రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రెడాయ్ కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురికి లేఖ రాసింది. ధరల పెరుగుదలతో నిర్మాణ వ్యయం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. చిన్న, మధ్యతరహా రియల్ ఎస్టేట్ సంస్థల మనుగడకు తక్షణం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని క్రెడాయ్ కోరింది.