న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అనాజ్ మండి సమీపంలోని జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో మంటల్లో చిక్కుకున్న పలువురిని రాజేశ్ శుక్లా అనే ఫైర్ మెన్ ప్రాణాలకు తెగించి రక్షించారు. భవంతిలోకి మందుగా ప్రవేశించిన ఫైర్మెన్ రాజేశ్ శుక్లా… 11 మందిని కాపాడారు. ఈ క్రమంలో ఆయన కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను లోక్ నాయక్ జయప్రకాశ్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 11 మంది ప్రాణాలను కాపాడిన శుక్లాను ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్ అభినందించారు. ఆయన సాహసోపేతంగా విధులను నిర్వర్తించారంటూ.. రియల్ హీరోకు సెల్యూట్ చేశారు.
Fireman Rajesh Shukla is a real hero. He was the first fireman to entered the fire spot and he saved around 11 lives. He did his job till the end despite of his bone injuries. Salute to this brave hero. pic.twitter.com/5aebB2XLUd
— Satyendar Jain (@SatyendarJain) December 8, 2019
మరోవైపు ఢిల్లీలో సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరుకుంది. ఓ భవనంలో ఫ్యాక్టరీ కార్మికులు నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక చాలా మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అనాజ్ మండి ప్రాంతం ఇరుకుగా ఉండటంతోపాటు.. మంటల నుంచి తప్పించుకోవడానికి నిబంధనల ప్రకారం ఉండాల్సిన అత్యవసర మార్గాలు లేకపోవడంతో.. కార్మికులు అగ్నికి ఆహూతయ్యారని ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్ని ప్రమాదానికి గురైన భవంతిలో విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు అధికంగా ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గుర్తించాయి. మూడు, నాలుగు అంతస్తుల్లో ఎక్కువగా విష వాయువులు ఉండటంతో.. ఊపిరి ఆడాక చాలా మంది కార్మికులు చనిపోయారని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ ప్రతాప్ సింగ్ తెలిపారు. మంటల్లో చిక్కుకున్న వారిలో 59 మందిని రక్షించామని అదికారులు చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటనలో ప్రాణాలు వదిలిన వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ఢిల్లీ సర్కారు ప్రకటించింది. గాయపడిన వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారాన్ని అందజేస్తామని తెలిపింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రాణనష్టాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.