తిరుపతిః తమిళనాడులో ఉగ్రవాదుల కదలికలున్నాయన్న నిఘా హెచ్చరికలతో తిరుపతిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రేణిగుంట మొదలుకుని చంద్రగిరి నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను పోలీసులు పకడ్బందీగా సోదాలు నిర్వహిస్తున్నారు. రద్దీ ప్రాంతాలు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హైవేలపై డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. అనుమానస్పదంగా ఎవరూ కనిపించినా అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు తిరుపతి అర్బన్ ఎస్పీ సూచించారు. తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు.
లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు టెర్రరిస్టులు శ్రీలంక ద్వారా తమిళనాడులో ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడులో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం చెన్నై సహా పలు ప్రాంతాల్లో పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.