కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయటంతో అడిషనల్ ఎస్పి బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక ధర్యాప్తు బృందాన్ని( సిట్) ఏర్పాటు చేస్తూ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
వివేకానంద రెడ్డి మృతదేహంపై ఏడు చోట్ల గాయాలు ఉన్నట్లు శవపరీక్ష నివేదికలో తేలింది. వివేకా మృతదేహం పడిఉన్న బెడ్రూమ్లో బాగా రక్తం కారి ఉంది. ఇంటి వెనుక తలుపు తీసి ఉందని ఆయన పిఎ కృష్ణారెడ్డి తన ఫిర్యాదులోనే పేర్కొన్నారు. ఆయన తల వెనక భాగంలో రెండు చోట్ల, నుదిటిపై, ముక్కుపై, అరచేతిపై గాయాలున్నాయి.
బాత్రూమ్లో పడిఉన్న వివేకానంద రెడ్డి మృతదేహం
వివేకా మృతి సహజ మరణం కాదని కడప పోలీసులు ప్రాధమికంగా గుర్తించిన విషయం తెలియగానే రాష్ట్ర పోలీసు డిజిపి ఆర్.పి. ఠాకూర్ అయిదు బృందాలతో ప్రత్యేకంగా ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసారు. సిఐడి అదనపు డిజి అమిత్ గార్గ్ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తారు.
ముందు అందిన సమాాచారం:
కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో వివేకానంద రెడ్డి భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పులివెందల ఆసుపత్రిలోనే మృతదేహం భద్రపరిచారు. కడప నుండి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ పులివెందులకు బయలుదేరి వెళ్లాయి.
వివేకా మృతి వార్త తెలియగానే హైదరాబాద్ నుండి భార్య సౌభాగ్య హైదరాబాద్ నుండి పులివెందులకు బయలుదేరారు.
గత ఐదు రోజులుగా వైసిపి అభ్యర్థుల ఎంపికలో జగన్ కు తోడుగా ఉన్న వివేకానంద రెడ్డి గురువారం అంతా మైదుకూరు ప్రాతంలో ప్రచారం నిర్వహించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో పులివెందుల చేరుకున్నారు. ఇంట్లో వివేకా ఒక్కరే ఉంటున్నారు. బాత్రూం లో నే ఆయన ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఒకసారి గుండె పోటు రాగా స్టంట్ వేయించుకున్నారు.
వివేకానంద రెడ్డి పర్సనల్ సెక్రటరీ కృష్ణారెడ్డి పులివెందల పోలీసులకు రాసిచ్చిన ఫిర్యాదు
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బయటకు వచ్చినా గానీ వివేకానంద రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా వదిన వైయస్ విజయమ్మ పైనే వివేకా నంద రెడ్డి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులకు వ్యతిరేకంగా వివేకా మీసం మెలేసి ఛాలెంజ్ చేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
అనంతర పరిణామాల్లో వివేకా కాంగ్రెసును వీడి వైసీపీలో చేరారు. పార్టీ కార్యక్రమాల్లో జగన్కు అండగా నిలుస్తూ వచ్చారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్కు వివేకా పేరు పరిశీలనలో ఉండగా ఆయన కన్ను మూసారు.