(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపారు. దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుల మృతదేహాలు ఎలా ఉన్నాయంటూ హైకోర్టు ఆరా తీసింది. మృతదేహాల పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శనివారం హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఎన్కౌంటర్ కేసులో ఆధారాల సేకరణపై తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో మృతదేహాలకు మరోసారి పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలిస్తామని.. ఢిల్లీ ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం చేయిస్తామని పేర్కొంది. అయితే, కోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ.. రాష్ట్రేతర నిపుణులతో రీపోస్టుమార్టం అవసరం లేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం అభిప్రాయం అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 10.30గంటల్లోపు అభిప్రాయం తెలపాలని ఏజీని ఆదేశించింది. తదుపరి విచారణను శనివారానికి కోర్టు వాయిదా వేసింది.
డిసెంబరు 6న షాద్ నగర్ మండలం చటాన్పల్లి బ్రిడ్జి సమీపంలో దిశను తగులబెట్టిన చోటే నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. కాల్పుల్లో నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయిన సంగతి తెలిసిందే.
మరోవైపు నిందితుల మృతదేహాలు క్రమంగా కుళ్లిపోతున్నాయి. తాము చెప్పే వరకు మృతదేహాలకు అంత్యక్రియులు నిర్వహించొద్దన్న కోర్టు ఆదేశాలతో పోలీసులు వాటిని గాంధీ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగి 15 రోజలవుతోంది. ఈ నేపథ్యంలో మృతదేహాలు కుళ్లిపోయే స్థితికి వస్తున్నాయి. ఇప్పటికే ఆ మృతదేహాలు చెడిపోకుండా ఉండేందుకు ఎంతో ఖరీదైన ఇంజెక్షన్స్ ఇచ్చి.. ఎంబామింగ్ చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోతోంది. డెడ్ బాడీలకు ఎంబామింగ్ చేస్తే.. దాదాపు రెండు వారాల పాటు చెడిపోకుండా ఉంటాయి. అయితే, రీ పోస్టుమార్టానికి అవకాశం ఉండదు. ఎంత శీతల ప్రదేశంలో ఉంచిన అవి వారానికే ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా కుళ్లిపోతుంటాయి. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ లేదు. దీంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మృతదేహాలను ఢిల్లీకి తరలిస్తే మంచిదనే అభిప్రాయాన్ని కూడా వైద్యులు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.