ఇస్లామాబాద్: మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళాలు పాకిస్థాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 1000కిలోల బాంబులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మూడు కీలక ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 300మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
అయితే, ఈ దాడులకు సంబంధించిన శబ్ధం విన్న స్థానిక బాలకోట్ వాసులు భూకంపం సంభవించిందని భావించారట. భారీ శబ్ధం రావడంతో ఈ ప్రాంతంలో మరోసారి భూకంపం చోటు చేసుకుందని అనుకున్నామని ఆ ప్రాంత వాసులు బుధవారం వెల్లడించారు.
పాకిస్థాన్ ఉత్తర-పశ్చిమ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో బాలకోట్ పట్టణం ఉంది. 2005లో ఈ ప్రాంతంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతమంతా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సౌదీ అరేబియా అందించిన సాయంతో ఈ పట్టణాన్ని మళ్లీ పునర్నించారు.
ఒక్కసారిగా భారీ శబ్ధాలు రావడంతో ఉలక్కిపడి లేచామని బీబీసీ ఉర్దూకు బాలకోట్ వాసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున భారీ శబ్ధాలను తాము కూడా విన్నామని బాలకోట్ పరిసర పట్టణాల ప్రజలు వెల్లడించారు.
బాలకోట్లోని జాబా గ్రామానికి చెందిన రైతు మొహమ్మద్ అదిల్ మాట్లాడుతూ.. మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో భారీ శబ్ధాలు విని తాను, తన కుటుంబసభ్యులు నిద్రలోంచి లేచామని చెప్పారు. మరోసారి ఈ ప్రాంతంలో భూకంపం సంభవించి ఉండవచ్చని భావించినట్లు తెలిపారు. బయటికి వచ్చి చూస్తే విమానాల శబ్ధం వినిపించింది. బాలకోట్ ప్రాంతంలో పెద్ద బిలం ఏర్పడినట్లు గుర్తించామని తెలిపారు.