(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అన్ని మౌలిక సదుపాయాలతో అందుబాటులో ఉన్న నగరం విశాఖపట్నం అని, అందుకే అక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్కు బెస్ట్ ఆప్షన్ అని చెప్పామని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జిఎన్ రావు తెలిపారు. రాజధానికి విశాఖ అనుకూలం కాదంటూ జిఎన్ రావు కమిటీ నివేదికలో పేర్కొన్నట్లుగా రెండు దిన పత్రికల్లో కథనాలు ప్రచురితం అయిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.
విశాఖ రాజధానికి అనుకూలం కాదని చెప్పలేదనీ, విశాఖ, మచిలీపట్నం, విజయవాడ లాంటి పట్టణాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పామని అన్నారు. దురదృష్టవశాత్తు కొందరు కావాలనే తమ వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లంతా రిపోర్టు తయారు చేశారని జిఎన్ రావు చెప్పారు. జూన్ నెలలో 13 జిల్లాల్లో పర్యటించామని తెలిపారు. విశాఖ తీరంలో ప్రతికూల వాతావరణం ఉన్నమాట వాస్తవమేననీ, అందుకే అక్కడ పెట్టమని చెప్పలేదనీ, 50 కిలో మీటర్ల దూరంలో పెట్టాలని చెప్పామనీ అన్నారు. సముద్ర తీర ప్రాంతం కోతకు గురికాకుండా ఎవరూ ఆపలేరని చెప్పారు. హైకోర్టు వస్తే నాలుగు జిరాక్సు షాపులు వస్తాయనడం తప్పని జిఎన్ రావు అన్నారు. రాష్ట్రంలో విశాఖ ఒక్కటే మెట్రోపాలిటన్ నగరమని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని 13 జిల్లాలను నాలుగు జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జోన్ ఒకటిగా ఉండాలని నివేదికలో పేర్కొన్నామన్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టాలని ప్రభుత్వానికి చెప్పామన్నారు. విశాఖకు ఉత్తర ప్రాంతంగా ఉన్న ప్రదేశంలో సెక్రటేరియట్ పెట్టుకోవచ్చని సూచించామనీ, సముద్ర తీరంలో పెట్టమని చెప్పలేదనీ జిఎన్ రావు అన్నారు.