అమరావతి: జెంబో జెట్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలవర్గాన్ని మేనేజ్ చేయడం కార్యనిర్వహణ అధికారికి కష్టసాధ్యమేనని గతంలో టిటిడి కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నేటి బిజెపి నేత ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.
తాను పేపరు చూడకముందే నిన్నటి నుండి టిటిడి బోర్డుపై అభిప్రాయం తెలియజేయమని తెలుగు తమ్ముళ్లు ఉబలాటపడ్డారని ఐవైఆర్ పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా గురువారం ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
టిటిడి వ్యవస్థలో నిర్ణయాలు ఇఒ, చైర్మన్, ముఖ్యమంత్రి మధ్య నడుస్తాయని ఆయన చెప్పారు. బోర్డు సభ్యులు దర్శనాలకు మాత్రమేనని ఐవైఆర్ చెప్పుకొచ్చారు. 14మంది సభ్యులు ఉన్న బోర్డు మేనేజ్ చేయడమే తనకు ఆ రోజుల్లో పెద్ద సమస్య అయ్యిందనీ, ఇప్పుడు 29మంది సభ్యుల బోర్డును మేనేజ్ చేయడంలో ఇఒ పడే బాధ వర్ణనాతీతం అని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. ఇక భక్తి భావాలు కలిగిన వాళ్ళు బోర్డులో ఉండాలంటే అది ఏనాడూ జరగలేదనీ, ఇప్పుడైనా, భవిష్యత్తులోనైనా జరుగుతుందన్న ఆశ లేదనీ ఐవైఆర్ అన్నారు. స్వామిగారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా దేవాలయాలకు ప్రభుత్వం నుండి విముక్తి వస్తేనే ముక్తి ఉంటుందని ఐవైఆర్ పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ముందునుంచి ఉన్న విషయమేననీ, తెలుగు వారికి ఉన్న సింహభాగం అట్లానే కొనసాగుతున్నదనీ ఐవైఆర్ అన్నారు.