హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నామినేషన్ల గడువు ఐదు గంటలకు ముగిసింది. అయితే, అంతకు ముందే టీఆర్ఎస్ అసంతృప్తులకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని ఆశించి భంగపడ్డ టీఆర్ఎస్ నాయకుడు దర్గా దయాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. దయాకర్ రెడ్డి ఇంటికెళ్లి కలిసిన రేవంత్ రెడ్డి.. అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బీఫారం అందించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేస్తుందన్నారు. మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. డబ్బులతో, అక్రమ కేసులతో రాజకీయాలు చేయాలనుకునేవారికి తాజా పరిణామాలు కనువిప్పు అని పేర్కొన్నారు. పీర్జాదిగూడలో మేయర్, డిప్యూటీ మేయర్ వార్డులన్నింటినీ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పీర్జాదిగూడలో టీఆర్ఎస్ పార్టీ తరఫున కీలక నేతగా ఉన్న దయాకర్ రెడ్డి.. మేడ్చల్ నుంచి మంత్రి మల్లారెడ్డి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. దయాకర్ రెడ్డి ఇన్నాళ్లూ మంత్రి మల్లారెడ్డికి అనుచరుడిగా కొనసాగారు. కొత్తగా ఆవిర్భవించిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్ పదవికి పోటీ చేయాలని ఆయన ఆశించారు. గురువారం(జనవరి 9) సీఎం కేసీఆర్ను కలిశారు. అయితే, టీఆర్ఎస్ అధినాయకత్వం దయాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి అంగీకరించలేదు. దయాకర్ రెడ్డికి మేయర్ టికెట్ నిరాకరించిన సీఎం కేసీఆర్.. మరోవిధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తీవ్ర అసంతృప్తి గురయిన దయాకర్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.