(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్లో కాంగ్రెస్కు చేదు ఫలితాలు వచ్చాయి. కొడంగల్ మున్సిపాలిటీలో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 12 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ ఎనిమిది గెలుపొందగా, కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కొడంగల్కు ఎక్కువ సమయం కేటాయించినప్పటికీ ఫలితం లేకపోయింది. టీఆర్ఎస్కు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృత్తం చేస్తూ.. కొడంగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ ను గెలిపించుకునేందుకు రేవంత్ తీవ్రంగా శ్రమించినా ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే, ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అయితే, కొడంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయాన్ని కట్టబెట్టి సొంత నియోజవర్గంలో మళ్లీ సత్తా చాటాలని భావించిన రేవంత్ కు ఈ ఫలితాలు నిరాశను కలిగించాయి.