(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్కే జై కొట్టాయి. అయితే, ఇప్పుడు గులాబీ పార్టీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. ఒకే ఒక అంశం టీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతోంది. ‘రోడ్డు రోలర్’ గుర్తు తమకు డ్యామేజీ చేసిందనే ఆందోళన ఆపార్టీకి పట్టుకుంది. ఆ గుర్తు కొంప ముంచుతుందా? మెజార్టీ తగ్గిస్తుందా? లేక అసలుకే ఎసరు తేస్తుందా? అని గులాబీ నేతలు తెగ భయపడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ఈ ఉపఎన్నికపై పడలేదని, సర్వేలన్నీ టీఆర్ఎస్దే గెలుపు అని చెబుతున్నాయి. కానీ ఎక్కడో ఒక డౌట్. హుజూర్నగర్లో మొత్తం 2లక్షల 754 ఓట్లు పోలయ్యాయి. 84.76 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే ఐదు శాతం ఎక్కువగా ఓట్లు పడ్డాయి. దాదాపు పదివేలకు పైగా మెజార్టీతోనే గెలుస్తామని గులాబీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై ఏడు వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ గెలిపొందారు. అయితే, ఈసారి టీఆర్ఎస్ అధిక మెజార్టీ సాధిస్తుందని నేతలు భావిస్తున్నారు. అయితే, రోడ్డు రోలర్ గుర్తు ఏం చేస్తుందో అనే దడ ఇప్పుడు టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది.
హుజూర్నగర్లో ఈవీఎంలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు మొదట ఐదు ప్లేస్లు కేటాయించారు. ఐదో ప్లేస్లో కారు గుర్తు ఉంది. దాని వెంటనే రైతు నడిపే ట్రాక్టర్ గుర్తు…ఆ తర్వాత రోడ్డు రోలర్ గుర్తు ఉన్నాయి. మూడు గుర్తులు చూసేందుకు ఒకేలా ఉన్నాయి. దీంతో ఇప్పుడు వృద్ధులు,మహిళలు, కొంత సైట్ ఉన్న వారు కారు అనుకుని పొరపాటున రోడ్డురోలర్కు వేశారని పోల్ పోస్టుమార్టంలో తేలింది. దీంతో గులాబీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. రోడ్డు రోలర్ ఏంత మేరకు డ్యామేజీ చేసిందనే లెక్కలు సేకరించే పనిలో పడ్డారు. కనీసం ఐదు వేల ఓట్లు రోడ్డు రోలర్కు పడే అవకాశాలు ఉన్నాయనేది ప్రాథమిక అంచనా. మరికొందరు నేతలు మాత్రం కేవలం వెయ్యి నుంచి 1500 ఓట్లు పడ్డాయని లెక్కలు వేస్తున్నారు.
తెలంగాణలో జరగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు టీఆర్ఎస్ కి 30 నుంచి 35 సీట్లలో ప్రభావం చూపింది. దీని కారణంగా కొన్ని గెలవాల్సిన సీట్లు కోల్పోయింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ రోడ్డు రోలర్ సింబల్ ఎఫెక్ట్ చాలానే పడింది. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో రోడ్ రోలర్ దెబ్బకు టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఓడిపోయారు. ఇక్కడ రోడ్ రోలర్కు 27వేల 973 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్ల తేడాతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. దీంతో ఈ ఉపఎన్నిక గెలుపుపై గులాబీ నేతలు టెన్షన్ పడుతున్నారు. రిపబ్లిక్ సేన పార్టీకి చెందిన అభ్యర్థికి రోడ్ రోలర్ గుర్తు వచ్చింది. ఈయనకు ఎన్ని ఓట్లు పడతాయని అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పొలిటికల్ లెక్కలు వేస్తున్నారు.