హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపలేమని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెపై సంస్థ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో తుది అఫిడవిట్ దాఖలు చేశారు. విలీనం డిమాండ్ ప్రస్తుతానికి మాత్రమే పక్కన పెడుతున్నాయని, భవిష్యత్ లో మళ్లీ విలీనం డిమాండ్ తెరపైకి రావొచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమని, ఆర్టీసీ జేఏసీ నేతలు కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసం విపక్షాలతో కలిసి కుట్రపూరితంగా సమ్మెకు వెళ్లారని కౌంటర్ లో ఆరోపించారు. డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించేందుకు కార్మిక శాఖ మధ్యవర్తిత్వం చేపట్టినప్పటికీ.. యూనియన్ నాయకులు ఓపిక పట్టలేదన్నారు. ఆర్టీసీని బ్లాక్ మెయిల్ చేసే ధోరణితో సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించాయని పేర్కొన్నారు.
సమ్మె చేయడం కార్మికుల హక్కే అయినప్పటికీ అది చట్టానికి అనుగుణంగా ఉండాలని తెలిపారు. సమ్మె వల్ల ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందన్నారు. ఇప్పటికిప్పుడు ఆర్టీసీని బాగుచేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కాబట్టి ఆర్టీసీతో చర్చలు జరపడం కష్టమని.. సమ్మెను చట్టవిరుద్దంగా ప్రకటించాలని ఆర్టీసీ ఎండీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.