(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. శ్రీనివాసరెడ్డి మృతిని అమరుడు శ్రీకాంతాచారితో పొలుస్తున్నారు కార్మికులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగిన మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి. తాజాగా ఆర్టీసీ కార్మికుల కోసం డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నంతో ఈ ఉద్యమం మరో దశకు చేరింది. ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన శ్రీనివాసరెడ్డి.. ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలు విడిచాడు.
ఖమ్మం ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస రెడ్డి శనివారం మధ్యాహ్నం తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కాపాడేందుకు ప్రయత్నించిన అతడి కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి 90 శాతం కాలిన గాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యానికి ఆయన శరీరం సహకరించలేదు. ఆయన మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారన్న వార్తతో ఆర్టీసీ ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు. ఈ విషాదంతో చలించిన శ్రీనివాస్ రెడ్డి సన్నిహితుడు, మరో డ్రైవర్ వెంకటేశ్వర్లు కూడా పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ‘తెలంగాణ కోసం పాటుపడిన మమ్ములను కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసినట్లుగానే.. ఇప్పుడూ జరిగితేనే కానీ ప్రభుత్వం స్పందించేలా లేదు’ అని కన్నీరు పెట్టుకున్నాడు.
తెలంగాణ ఉద్యమం అంటేనే మొదట గుర్తుకొచ్చేది అమరవీరుల త్యాగఫలం. మలి తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని శ్రీకాంతాచారి… తన శరీరం మంటల్లో కాలిపోతున్నా జై తెలంగాణ అని నినదించాడు. శ్రీకాంతాచారి అమరత్వం మలి దశ ఉద్యమానికి పురుడు పోసింది. అయితే, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇప్పటికే 48 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. నాడు తెలంగాణ రాష్ట్రంలో కోసం శ్రీకాంతాచారి అమరుడు అయితే, నేడు కార్మికుల కోసం డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ప్రాణ త్యాగం చేశాడు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస రెడ్డి మృతి నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదీ ఏమైనా డిమాండ్ల సాధన కోసం పోరాటం చేయాలని కానీ, ఆత్మ బలిదానం చేయవద్దని పలువురు కోరుతున్నారు.
సీమాంధ్రుల సమైక్య నినాదానికి వ్యతిరేకంగా అప్పట్లో సకల జనుల సమ్మె జరిగితే.. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సకల జనుల సమ్మె జరగబోతోంది. సమ్మె విషయంలో అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు పట్టు వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. సమ్మెను ఉద్ధృతం చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల ఈ నెల 19న తెలంగాణలో బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న ర్యాలీలు, 17న ధూంధాం కార్యక్రమాలు, 18న బైక్ ర్యాలీలు, 19న తెలంగాణ బంద్ చేపట్టాలని నిశ్చయించారు.