(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి. అయినప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం దిగిరాదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు 26 డిమాండ్లతో కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే సమ్మె చేపట్టిన వారిలో 48,000 వేల మందిని ఆర్టీసీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ సమ్మె ఆగదని కార్మికులు పట్టు వదలడం లేదు.
తెలంగాణ ఉద్యమానికి కీలకమైన సకల జనుల సమ్మె సాగిన సెప్టెంబర్ మాసంలోనే ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ పోరాట సమయంలో జరిగిన ఘటనలను.. ఆర్టీసీ కార్మికులు గుర్తుచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి.. తెలంగాణ ఉద్యమంలో తమ వంతు ప్రధాన పాత్ర పోషించారు. ఆర్టీసీ కార్మికులు పోరాటంలోకి రావటంతోనే సకలజనుల సమ్మె.. ఆనాటి ప్రభుత్వాన్ని వణికించింది. ఆర్టీసీ కార్మికులంతా కలిసి సరిగ్గా 30 రోజులకుపైగా తమ విధులను పక్కనపెట్టి.. బస్సులు నిలిపివేసి ఉద్యమానికి దిగారు. ఆ సమ్మె ఇక తెలంగాణ వచ్చి తీరుతుందనే విశ్వాసం ఇచ్చింది. నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికుల త్యాగాలను ప్రశంసించారు. ఆర్టీసీ కార్మికులను కడుపులో దాచుకుని కాపాడుకుంటామని ఆనాడు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యమ సమయంలో నాడు తమకు సంఘీభావం తెలిపిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత చూపుతున్నారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అధికారమే ఎజెండాగా కేసీఆర్ వ్యవహరించారని.. ఎన్నికల ముందు హామీల మీద హామీలు గుప్పించి ఇప్పుడు కార్మికులపై బురద జల్లు తున్నారని మండిపడుతున్నారు. పండుగ సమయంలో కార్మికులు సమ్మె చేపడితే ప్రజలు ఇబ్బందులు పడతారని ప్రభుత్వానికి తెలుసు. కాని ప్రజల్లో కార్మికులను విలన్లుగా మార్చేందుకుకే వ్యూహాలు పన్నుతున్నారని కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని.. తమ వేతనాన్ని పెంచాలని కార్మికులు ఆందోళనలు చేశారు. అయితే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోగా.. వారి వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇక ఆ ఒప్పందం 2017 మార్చి 31తో ముగిసింది. అయితే గత రెండేళ్లుగా కార్మికుల వేతనాన్ని పెంచలేదు. ఈ నేపథ్యంలోనే కార్మికులు సమ్మె బాటపట్టారు. మరోవైపు ఆర్టీసీ యూనియన్లకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ తదితర విపక్ష పార్టీలు మద్దతు తెలుపడంతో ఇది రాజకీయ రంగు సంతరించుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుందని తెలంగాణ జనసమితి అధినేత కోదంరామ్ హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అందరం అండగా నిలుస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని, ఆయన చప్పినట్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని కోదండరామ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చేందుకు అఖిల పక్ష నాయకులు నిర్ణయం తీసుకున్నారు. 2011లో సకల జనుల సమ్మె కూడ సెప్టెంబర్ మాసంలోనే ప్రారంభమైంది. అదే ఏడాది అక్టోబర్ 24వ తేదీన సమ్మె ముగిసింది. ఉద్యమంలో సకల జనుల సమ్మె ఏ రకమైన పాత్ర పోషించిందో… నేడు ఆర్టీసీని రక్షించుకొనేందుకు తమ సమ్మె కూడ అదే రకమైన పాత్ర పోషించే అవకాశం ఉందని ఆర్టీసీ జేఎసీ నేతలు అంటున్నారు.