అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఆర్టిసి విలీనం ప్రక్రియ అయితే ప్రారంభించింది కానీ ఆర్టిసి ఉద్యోగుల జిపిఎఫ్ డిమాండ్ సర్కార్ గొంతుకు అడ్డం పడుతున్నది. ఆర్టిసిని ప్రభుత్వలో విలీనం చేసిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న అన్ని సదుపాయాలు తమకు కూడా వర్తింపజేయాలని ఆర్టిసి కార్మిక సంఘాల నేతలు పట్టుబడుతున్నారు.
అందులో ప్రధానంగా జిపిఎఫ్ వర్తింపజేయడంలో సమస్య ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
కార్పోరేషన్లోని వేలాది మంది సిబ్బందికి పెన్షన్ ఇవ్వడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందనీ, ఇలాంటి తరుణంలో కార్పోరేషన్లోని 52వేల మందికి అదనంగా జీతాలు చెల్లించడంతో పాటు భవిష్యత్తులో పెన్షన్ ఇవ్వడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పెన్షన్ లేని విలీనం తమకు ఏ మాత్రం ఉపయోగం కాదని గుర్తింపు కార్మిక సంఘం ఈయూ, ఎన్ఎంయూ నేతలు పేర్కొంటున్నారు. తమ వద్ద ఉన్న ఈపిఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే తీసుకుని తమకు జిపిఎఫ్ వర్తింపజేయాలని ఆర్టిసి కార్మికులు కోరుతున్నారు. ఈ విషయాన్నే ఎస్టాబ్లిష్మెంట్ కమిటీకి తెలియజేశారు. అయితే 2004 తరువాత ప్రభుత్వ ఉద్యోగులకే సిపిఎస్ వర్తింపజేస్తున్న ప్రభుత్వం.. కొత్తగా విలీనమయ్యే కార్పోరేషన్ ఉద్యోగులకు ఎలా ఇవ్వగలదని ఆర్థిక శాఖ ప్రశ్నిస్తోంది.
ఆర్టిసి ఉద్యోగుల విలీన ప్రక్రియను 2020 జనవరి నాటికి పూర్తి చేయాలని రవాణా శాఖ కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాల కోరికలను ఎస్టాబ్లిష్మెంట్ కమిటీ నమోదు చేసింది. ఉద్యోగ సంఘాల కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.