(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆర్టీసీ కార్మికులకు దీపావళి వెలుగులు లేవు. దసరా పండుగను ఎలాగూ జరుపుకోలేకపోయారు. కనీసం దీపావళి నాటికైనా సమ్మెకు విరమణ లభిస్తుందని భావించారు. కానీ, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించలేదు. దీంతో దీపావళి పండుగ కూడా కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపలేని పరిస్థితి నెలకొంది. ప్రజలు దీపావళి వెలుగులను ఆస్వాదిస్తుంటే ఆర్టీసీ కార్మికులు మాత్రం ఆవేదనతో కూడిన ముఖాలతో కనిపిస్తున్నారు. సమ్మెకు పరిష్కారం లేకపోగా.. సెప్టెంబరు నెల వేతనాలు కూడా కార్మికులకు అందలేదు. ఇప్పటికే బతుకమ్మ, దసరా పండుగలకు దూరంగా ఉన్న కార్మిక కుటుంబాల ముంగిట నేడు దీపావళి వెక్కిరిస్తున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని గత 23 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. శనివారం యాజమాన్యంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యం 21 డిమాండ్లపై చర్చలకు సిద్దం కాగా.. కార్మిక నేతలు మాత్రం మొత్తం 46 డిమాండ్లపై చర్చలు జరపాలని పట్టుబడ్డారు. నేతల డిమాండ్లను ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. దీంతో సమ్మె యథావిధిగా కొనసాగుతుందని.. డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
సుదీర్ఘంగా సమ్మె కొనసాగుతుండడం పట్ల కార్మిక కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సమ్మెను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోవడంపై ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబరు నెల వేతనాలను కూడా ఇంత వరకు చెల్లించలేదు. పని చేసిన కాలానికి తప్పనిసరిగా వేతనాలు చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు కూడా సూచించింది. కానీ… వేతనాల కోసం రూ.230 కోట్లు కావాలని, అంత డబ్బు ఆర్టీసీ వద్ద లేదని, కేవలం రూ.7 కోట్లు మాత్రమే నగదు ఉందంటూ కోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అయితే, కార్మిక సంఘాలు మాత్రం దీనితో విభేదిస్తున్నాయి. కార్మికులు, అధికారులందరికీ కలిపి ప్రతి నెలా వేతనాల కోసం రూ.110 కోట్లే వెచ్చిస్తారని చెబుతున్నాయి. మరోవైపు ఆర్టీసీ సమ్మె 23వరోజూ ఉధృతంగా సాగుతోంది. ఆర్టీసీని కాపాడడం ప్రపంచంలో ఎవరివల్లా కాదంటూ సీఎం కేసీఆర్ చేసిన వాఖ్యలపై కార్మికులు భగ్గుమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదిఇలా ఉంటే.. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పండగ వేళ.. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీపావళి పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సులు ఎక్కువగా లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వాహనాదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. సమ్మెపై ఇటు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం.. అటు ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో మధ్యలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.