హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం గత 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రేపటి నుంచి కార్మికులందరూ విధుల్లో చేరాలని జేఏసీ నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కీలక ప్రకటన చేశారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు. సమ్మె విరమించినా నైతిక విజయం కార్మికులదేనని అన్నారు. కార్మికులు ఓడిపోలేదని, ప్రభుత్వ గెలవలేదని పేర్కొన్నారు. మంగళవారం నుంచి ఆర్టీసీలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు విధులకు దూరంగా ఉండాలని సూచించారు. వాళ్లెవరూ విధులకు హాజరుకావొద్దని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు జేఏసీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత యాజమాన్యం నుంచి కనీసం స్పందన రాలేదని చెప్పారు. ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్బంధకాండ మధ్య నిరసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అధికారులు కొంతమంది ఆర్టీసీని అమ్ముకునే ప్రయత్నం చేశారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందని, దానిని అడ్డుకోవాలన్నారు.
కాగా, బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే తాము సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ కొద్దిరోజుల క్రితం ప్రకటించింది. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరికి తమంతట తామే విధుల్లోకి చేరతామని చెప్పినా… అందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు. దీంతో తమకు తాముగానే సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.