హైదరాబాద్: ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం తమతో తొమ్మిది నిమిషాలు చర్చిస్తే చాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, సీఎం కేసీఆర్ 9 గంటల పాటు అధికారులతో సమీక్ష చేసే బదులు.. 9 నిమిషాలు తమతో చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ మాఫియాకు కట్టబెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఈనెల 9న జరిగే మిలియన్ మార్చ్కు తరలిరావాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అన్ని పార్టీలు విలీనానికి ఒప్పుకున్నాయని, మేనిఫెస్టోలో కూడా పెట్టాల్సిన పరిస్థితులు తీసుకువచ్చామని చెప్పారు. విధుల్లో చేరిన కార్మికులు తిరిగి సమ్మెలో పాల్గొనాలని కోరారు. సీఎం కేసీఆర్ డెడ్లైన్కు ఒక్క కార్మికుడూ స్పందించలేదన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులు కొల్లగొట్టే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీనే నెరవేర్చాలని కోరుతున్నామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ చర్చలకు పిలిస్తే సమస్య వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. సమ్మె కాలంలో చనిపోయిన వారిని ఆదుకునేందుకు సమ్మె విరమించిన తరువాత కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
previous post