(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దసరా పండగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య మినీ సంగ్రామనే జరుగుతోంది. విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుంటే.. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడమని ఆర్టీసీ సంఘాలంటున్నాయి. ఇది ఇలా ఉంటే. హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ సమ్మె కొత్తగా రాజకీయ రంగును పులుముకుంది. ప్రజాసమస్యలపై పోరాటమంటేనే ముందుండే ఎర్రజెండా పార్టీలు ప్రస్తుతం ఎక్కడా కనపడడం లేదు. తాము సమ్మె చేస్తుంటే సంఘీభావం తెలుపకుండా, టీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపి సిద్ధాంతాలకు నీళ్లొదిలారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉపఎన్నికలపై పడే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు పార్టీల బలం ఎక్కువ. మొదటి నుంచీ కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉండి.. విప్లవోద్యమాలకు కేంద్రమైంది. 2004 వరకు ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చిన కమ్యూనిస్టు పార్టీలకు.. ఇప్పుడు ఉనికి చాటుకోవడమే గగనమైపోయింది. నల్లగొండలో కమ్యూనిస్టులు అంటే సిపిఐ, సిపిఎంలు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలు గెలిచి పలు స్ధానాల్లో పెట్టని కోటగా ఆపార్టీకి క్యాడర్ ఉండేది. కానీ నేడు అది జీరో అయిపోయింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో చెలిమి చేసిన సిపిఐ, ఈసారి హుజూర్ నగర్ లో పోటీ చేయకుండానే టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. ఈ మద్దతుపై ఇతర పార్టీల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఈ ఎన్నికలో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు జరగనుంది. ఇప్పటికే టీఆర్ఎస్ కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే, కార్మికుల వ్యతిరేక ప్రభుత్వానికి సీపీఐ మద్దతెలా ఇస్తుందని ఆర్టీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి, ఆర్టీసీకి మధ్య యుద్ధం కొనసాగితే.. హుజూర్ నగర్ ఉపఎన్నికలో దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఇది టీఆర్ఎస్ కు నష్టం కలిగించే అంశం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో పసుపు రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిజామాబాద్ లోక్ సభ స్థానాన్ని టీఆర్ఎస్ కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ స్థానాలు కైవసం చేసుకున్న టీఆర్ఎస్.. ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఘోరంగా దెబ్బ తగిలింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఇప్పటికే హుజూర్ నగర్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాని ప్రచారం చేస్తున్నారు. అయితే ఉప ఎన్నికల సమీపిస్తున్న వేళ..ఆర్టీసీ సమ్మె టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఓటములను నిర్ణయించే అవకాశం ఉంది. ప్రజల తీర్ఫు ఏ విధంగా ఉండబోతాయోనన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.