అమరావతి: ఏపీ శాసనమండలిలో రూల్ 71 నోటీస్ తీర్మానం నెగ్గింది. రూల్ 71కి మద్దతుగా 27 మంది టీడీపీ సభ్యులు ఓటేయగా.. 13 మంది వైసీపీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో 9 మంది తటస్థంగా ఉన్నారు. మంగళవారం ఉదయం నుంచి ఈ రూల్పై చర్చించాలని టీడీపీ పట్టుపట్టింది. మూడు రాజధానుల బిల్లుపై చర్చించాలని వైసీపీ కూడా డిమాండ్ చేసింది. ఈ గందరగోళ పరిస్థితిలో ఛైర్మన్ రూల్ 71పై చర్చకు అనుమతించారు. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించారు. ఈ రూల్కు అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 13 మంది ఓటు వేశారు. తటస్థంగా 9 మంది వ్యవహరించారు. అయితే ఓటింగ్ సందర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాగిరెడ్డిలు ఆపార్టీకి షాకిచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీలంతా రూల్ 71 నోటీస్కు అనుకూలంగా ఓటేస్తే.. వీరిద్దరు మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశారు. శత్రుచర్ల, శమంతకమణి సభకు గైర్హాజరు కాగా.. ఇప్పటికే డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఇక బీజేపీ, పీడీఎప్ ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. రూల్ 71 తీర్మానం నెగ్గిన తర్వాత మండలి బుధవారానికి వాయిదా పడింది. బుధవారం సీఆర్డీఏ రద్దు, ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరగనుంది.
previous post