హేమంత్ కర్కరేపై సాధ్వి ప్రగ్య వ్యాఖ్యలు
అన్ని వర్గాల నుంచి తీవ్రంగా విమర్శలు
వెనక్కి తీసుకున్న బీజేపీ నాయకురాలు
క్షమాపణలు కూడా చెప్పిన ప్రగ్యాసింగ్
మహారాష్ట్ర ఏటీఎస్ మాజీ చీఫ్, 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై నోరు పారేసుకున్న బీజేపీ నేత సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకుర్ వెనక్కు తగ్గారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో తాను జైల్లో ఉన్న రోజుల్లో కర్కరే తనను తీవ్రంగా వేధించారని, బూతులు తిట్టారని అన్నారు. దాంతో ఆయన సర్వనాశనం అవుతారని తాను శపించానని, ఆ శాపం వల్లే కర్కరే అంతమయ్యారని చెప్పారు. ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించాయి. ఐపీఎస్ సంఘాలతో పాటు పలు వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయితే బేషరతుగా మాత్రం క్షమాపణలు చెప్పలేదు. తన వ్యాఖ్యలు దేశ శత్రువులకు అనుకూలంగా మారుతాయనే తాను వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
భోపాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రగ్యాసింగ్.. అక్కడి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘నేను జైల్లో ఉన్నప్పుడు కర్కరేను కేసు విచారణ బృందంలోని ఓ సభ్యుడు ముంబైకి పిలిపించారు. ప్రగ్యాసింగ్కు వ్యతిరేకంగా ఆధారాలు లేనప్పుడు ఆమెను విడిచిపెట్టాలని కర్కరేకు ఆయన సూచించారు. కర్కరే వినిపించుకోలేదు. ఏమైనా చేసి ఆధారాలు సంపాదిస్తానని, దొరక్కపోతే సృష్టిస్తాను తప్ప ఆమెను విడిచిపెట్టేది లేదని ఆ అధికారితో కర్కరే చెప్పాడు. ఇది నాకు వ్యతిరేకంగా కర్కరే చేసి కుట్ర. అతడిది దేశద్రోహ, ధర్మవిరుద్ధ చర్య’’ అని వ్యాఖ్యానించారు. కేసు విషయంలో కర్కరే తనను ఏవేవో అడిగారని పేర్కొంది. ‘‘నాకేమీ తెలియదని, అంతా ఆ దేవుడికే తెలుసునని అతడికి నేను చెప్పాను. అయితే నన్ను ఆ భగవంతుడి దగ్గరకు వెళ్లమంటావా? అంటూ ప్రశ్నించాడు. అవసరమనుకుంటే తప్పనిసరిగా దేవుడి దగ్గరకు వెళ్లొచ్చు అని చెప్పాను. తర్వాత నన్ను బూతులు తిట్టాడు. అతడి తీరుతో నాలోని సహనం నశించింది. నువ్వు సర్వనాశనమవుతావంటూ అతడిని శపించాను. సరిగ్గా 45 రోజుల తర్వాత కర్కరే చనిపోయాడు’’ అని ఆమె చెప్పారు. పురాణాల్లో కర్కరేలాంటి రాక్షసులంతా తనలాంటి సాధువుల శాపంతోనే మరణించారని పేర్కొన్నారు.
అయితే, బీజేపీ మాత్రం అవి ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలేనంటూ తమకు సంబంధం లేదని చెప్పింది. ఆ తర్వాత కర్కరే ఉగ్రవాదుల బుల్లెట్లతోనే మరణించారని, ఆయన కచ్చితంగా అమరుడేనని ప్రగ్యాసింగ్ అన్నారు. భావోద్వేగానికి లోనయ్యే తాను వ్యాఖ్యలు చేశానన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే అందుకు క్షమాపణలు కూడా చెబుతున్నారని ప్రగ్యా సహాయకురాలు ఉప్మా సింగ్ తెలిపారు.
సాధ్వి వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ డీజీపీ అనమి రాయ్ స్పందించారు. ఆయన నేతృత్వంలోనే ఏటీఎస్ బృందం మాలెగావ్ కేసులో ప్రగ్యాసింగ్ మీద ఆరోపణలు మోపింది. ప్రగ్య వ్యాఖ్యలు అనైతికమని రాయ్ మండిపడ్డారు. అప్పట్లో హేమంత్ కర్కరే, విజయ్ సలాస్కర్ ఇద్దరూ ఉగ్రవాద దాడిలో మరణించడంతో వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున సహాయం ప్రకటిస్తున్నట్లు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. కాగా, సాధ్వి వ్యాఖ్యల నేపథ్యంలో రాయ్ మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలు తనను బాధపెట్టాయని, కేసు దర్యాప్తు మొత్తం చూసినది, చార్జిషీటు రాయించింది తానేనని తెలిపారు. అదంతా పక్కా ప్రొఫెషనల్ పద్ధతిలో జరిగింది తప్ప ఎలాంటి ఒత్తిడి తమపై లేదన్నారు. విచారణ ఇంకా కొనసాగుతోందని, నిందితురాలిని కోర్టు నిర్దోషిగా వదల్లేదని గుర్తుచేశారు. ప్రగ్యా వ్యాఖ్యలు తనను చాలా ఇబ్బంది పెట్టాయని మరో మాజీ ఐపీఎస్ అధికారిణి మీరన్ బొర్వాంకర్ అన్నారు. కర్కరే చాలా పెద్దమనిషని, ఆయన ఇప్పుడు లేరు కాబట్టి ప్రగ్యా ఏది పడితే అది మాట్లాడితే తగదని చెప్పారు. అలా అనడం ఆమె పాటించే భారతీయ సంస్కృతికి విరుద్ధమన్నారు.