జోధ్పూర్: కృష్ణ జింకలను వేటాడిన కేసులో నిందితుడైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ శుక్రవారం నాడు జోథ్పూర్ కోర్టు ముందు హాజరుకాలేదు. సినిమా షూటింగ్ లో బిజీ ఉన్న కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్టు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో సెషన్స్ కోర్టు ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. సల్మాన్ తరఫున న్యాయవాది కోర్టులో శుక్రవారం రెండు దరఖాస్తులు సమర్పించుకున్నాడు. విచారణకు మినహాయింపు కోరుతూ ఒకటి.. పూర్తిగా వ్యక్తిగత విచారణకు మినహాయింపు ఇవ్వడం మరొకటి. మొదటి దరఖాస్తును అంగీకరించిన కోర్టు.. రెండో దానిపై విచారణ డిసెంబర్ 19కి వాయిదా వేసింది.
దీనికి ముందు, జోధ్పూర్ కోర్టు విచారణకు సల్మాన్ఖాన్ వస్తున్న నేపథ్యంలో అతన్ని హతమారుస్తామంటూ గ్యారీ షూటర్ పేరిట ఫేస్బుక్లో హెచ్చరికలు వచ్చాయి. సల్మాన్ఖాన్ ఫోటోకు రెడ్ క్రాస్ మార్కు చేసి 007 లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరిట ఈ హెచ్చరికను పోస్టు చేశారు. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని రాజస్థాన్ పోలీసులు చెప్పారు. సల్మాన్ కోర్టుకు రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, షూటింగ్ బిజీ కారణంతో కోర్టు ముందు హాజరుకు సల్మాన్ దూరంగా ఉండిపోయారు.
1998వ సంవత్సరంలో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్ఖాన్ తన తోటి నటులు సైఫ్ ఆలీఖాన్, సోనాలీబెంద్రే, టబు, నీలం కొఠారీ, దుష్యంత్ సింగ్ లతో కలిసి రెండు కృష్ణ జింకలను వేటాడి చంపారనే ఆరోపణలు ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదైంది. ఈ కేసును జోథ్పూర్ కోర్టు దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో సల్మాన్ ఖాన్కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, రెండు రాత్రులు జైలులో ఉన్న అనంతరం బెయిలుపై విడుదలయ్యారు. గతేడాది మేలో సల్మాన్కు ఈ కేసులో బెయిల్ ముంజూరైంది. అప్పటి నుంచి కోర్టు మెట్లెక్కలేదు. ఈ ఏడాది జులై 4న జరిగిన విచారణ సందర్భంగా, సెప్టెంబరు 27న కోర్టు ముందు హాజరు కావాలని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చంద్ర కుమార్ సొరంగా తీర్పిచ్చారు. లేదంటే సల్మాన్కు బెయిల్ రద్దవుతుందని చెప్పారు.