ఈ నెల పదవ తేేదీన లొంగిపోయేందుకు అంబులెన్స్లో కోర్టుకు వచ్చిన రాజగోపాల్
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
హత్య కేసులో శిక్ష అనుభవించేందుకు పది రోజుల క్రితం కోర్టులో లొంగిపోయిన శరవణ భవన్ రెస్టారెంట్ల వ్యవస్థాపకుడు పి రాజగోపాల్ ఆసుపత్రిలో మరణించాడు. తనకు విధించిన యావజ్జీవ కారగారవాసం శిక్షను అనుభవించేందుకు మరికాస్త గడువు కావాలన్న రాజగోపాల్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఆయన లొంగిపోయాడు. జూలై 10వ తేదీన 72 ఏళ్ల రాజగోపాల్ అంబులెన్స్లో ముఖానికి ఆక్సిజన్ మాస్క్తో కోర్టుకు వచ్చి లొంగిపోయారు. తర్వాత ఆయనను చెన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు.
దోశ కింగ్ అన్న పేరు సంపాదించిన రాజగోపాల్ ఉల్లిపాయలు అమ్మటంతో మొదలుపెట్టాడు. శరవణ భవన్ స్థాపన అతని జీవితంలో పెద్ద మలుపు. ఆ శాకాహార రెస్టారెంట్కు ప్రజాదరణ రావడంతో దానిని విస్తరించారు. చూస్తుండగానే దేశమంతా శరవణభవన్ రెస్టారెంటు వచ్చాయి. ఇప్పుడు అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా సహా 20 దేశాల్లో శరవణభవన్ రెస్టారెంట్లు ఉన్నాయి.
1990 దశకం నాటి ఈ హత్య కేసులో రాజగోపాల్ నిందితుడైన కారణంగా ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా దీనికి పెద్ద ప్రచారం వచ్చింది. చెన్నైలోని శరవణభవన్లో అసిస్టెంట్ మానేజర్గా పనిచేసే వ్యక్తి కుమార్తెను రాజగోపాల్ వివాహం చేసుకోవాలనుకోవడంతో ఈ కథ మొదలయింది. ఆమెను వివాహమాడాల్సిందిగా రాజగోపాల్కు జ్యోతిష్యుడు సలహా ఇచ్చాడట. అప్పటికే అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే రాజగోపాల్ను ఆ యువతి తిరస్కరించింది.
1999లో ఆ యువతి ప్రిన్స్ శాంతకుమార్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అతనూ రాజగోపాల్ దగ్గర పని చేసేవాడే. రాజగోపాల్ భరించలేకపోయాడు విడిపోవాల్సిందిగా వారిపై వత్తిడి తెచ్చాడు. ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే శాంతకుమార్ను కిడ్నాప్ చేసి హతమార్చారు. అతని శవం అడవిలో దొరికింది.
భార్యతో శాంతకుమార్
శాంతకుమార్ను అడ్డు తొలగించుకుంటే ఆతని భార్యను పెళ్లి చేసుకోవచ్చన్న ఉద్దేశంతో రాజగోపాల్ ఈ హత్యకు ప్లాన్ చేశాడని ప్రాసిక్యూషన్ వాదించింది. రాజగోపాల్ నేరం చేశాడని 2004లో చెన్నై కోర్టు నిర్ధారించింది. అతనికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై రాజగోపాల్ హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ శిక్షను నిర్ధారించడమే కాకుండా దానిని యావజ్జీవ శిక్షగా మార్చారు. మొన్న మార్చి నెలలో సుప్రీంకోర్టు ఈ శిక్షను నిర్ధారించింది.