బాలాకోట్లోని జైషే మొహమ్మద్ శిక్షణా శిబిరంగా చెబుతున్న ప్రాతం ఉపగ్రహ చిత్రాలు. మొదటిది గత సంవత్సరం ఏప్రిల్ 25న తీసినది రెండవదు ఈ సంవత్సరం మార్చి నాలుగున తీసినది. భారత వాయుసేన విమానాలు ఫిబ్రవరి 26న ఈ శిబిరంపై బాంబులు కురిపించాయి.
న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని బాలాకోట్ దగ్గరున్న జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరాన్ని ఇండియా వాయుసేన విమానాలు బాంబులతో ధ్వంసం చేశాయన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదని రాయటర్స్ వార్తాసంస్థ పేర్కొన్నది.
పుల్వామా టెర్రర్ దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26 తెల్లవారుజామున ఎయిర్ఫోర్స్ విమానాలు సరిహద్దు దాటి బాలాకోట్ శిబిరంపై బాంబులు వేసి దానిని ధ్వంసం చేశాయని ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదు. వైమానిక దాడిలో 300 మంది ఉగ్రవాదులు మరణించారని దాడి జరిగిన వెంటనే మీడియా పేర్కొన్నది. దానికి ఆధారం ఏమిటో మాత్రం మీడియా చెప్పలేదు. తాజాగా కేంద్రంలో పరిపాలన చేస్తున్న బిజెపి అధ్యక్షుడు అమిత్ షా 250 మంది ఉగ్రవాదులు మృతి చెందారని ప్రకటించారు. ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ అధికారికంగా నోరు విప్పలేదు.
శాన్ఫ్రాన్సిస్కోలోని ప్లానెట్ లాబ్స్ ఇంక్ అనే సంస్థ సమకూర్చిన హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలను తనిఖీ చేసిన తర్వాత, బాలాకోట్లో విధ్వంసం ఛాయలు కనబడటం లేదని రాయటర్స్ పేర్కొన్నది. 2018 ఏప్రిల్లో తీసిన ఛాయాచిత్రాన్ని, దాడి జరిగిన తర్వాత ఆరు రోజులకు తీసిన ఛాయాచిత్రాన్నీ రాయటర్స్ పోల్చి చూసింది.
ఈ ఉపగ్రహ చిత్రాలపై స్పందించాల్సిందిగా విదేశాంగ శాఖనూ, రక్షణ మంత్రిత్వ శాఖనూ కొద్ది రోజుల క్రితం కోరినప్పటికీ ఎలాంటి జవాబూ రాలేదని రాయటర్స్ తెలిపింది. రాయటర్స్ విలేఖరులు కూడా బాలాకోట్ ప్రాంతాన్ని రెండుసార్లు సందర్శించి అక్కడి స్థానికులతో మాట్లాడారు. బాంబు దాడిలో ఏ భవనం అన్నా ధ్వంసమయినట్లు కానీ, ఎవర్ననా మృతి చెందినట్లు కానీ వారికి ఎలాంటి ఆధారాలూ లభించలేదని రాయటర్స్ తెలిపింది.
గత నెల 26న వరస పేలుళ్లు వినబడ్డాయని స్థానికులు రాయటర్స్ విలేఖరులకు చెప్పారు. బాలాకోట్ శిబిరానికి పైన బాంబు పేలుళ్ల కారణంగా ఏర్పడిన నాలుగు పెద్ద గుంటలు వారు చూపించారు. అక్కడ కొన్ని పైన్ వృక్షాలు కూడా ధ్వంసమయ్యాయి. దాడిలో ఎవరూ మరణించలేదని స్థానికులు చెప్పినట్లు రాయటర్స్ పేర్కొన్నది.