న్యూఢిల్లీః ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త చట్టం ప్రామాణికతను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం 2019 రాజ్యాంగవిరుద్ధంగా ఉందని, రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కొత్త చట్టం ప్రామాణికతను పరిశీలిస్తామని తెలిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు జులైలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో ఆమోదం పొంది.. అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
previous post
next post