న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసిన ప్రభుత్వ పథకాలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, ఏపీ, తెలంగాణ, బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకంపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో జనసేన నేత పెంటపాటి పుల్లారావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగిందని పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు. ఎన్నికల సమయంలో అమలు చేసిన ఈ పథకాలను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని విన్నవించారు. అదే విధంగా ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ నగదు బదిలీ పథకాలు అమలు చేయకుండా మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు.