ఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందనీ, ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం గురువారం కొట్టివేసింది.
బ్రిటన్కు చెందిన జ్యాకప్స్ లిమిటెడ్ అనే కంపెనీలో రాహుల్ గాంధీ డైరెక్టర్, కార్యదర్శి హోదాలో ఉన్నారని హిందూ మహసభ సభ్యుడు జై భగవాన్ గోయల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2005-06 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ వార్షిక ఐటి రిటర్న్స్లో పౌరసత్వం అనే కాలమ్లో రాహుల్ గాంధీ బ్రిటిషర్ అని రాశారని పిటిషనర్ వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
ఒక కంపెనీకి సంబంధించిన పేపర్ ఆధారంగా కోర్టును ఎలా ఆశ్రయిస్తారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ పిటిషనర్ను ప్రశ్నించారు.
ఇదే విషయంపై బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి ఫిర్యాదు మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం అమేఠీ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో అమేఠీతో పాటు వాయినాడ్ పార్లమెంట్ స్థానాల నుండి పోటీ చేస్తున్నారు.