అమరావతి: గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ‘ఛలో ఆత్మకూరు’ పిలుపుతో పల్నాడు ప్రాంతం ఉద్రిక్తభరితంగా మారింది. ఆత్మకూరులో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గుంటూరులోని టీడీపీ శిబిరం పోలీసుల అధీనంలో ఉంది. గుంటూరు, పల్నాడుల్లో పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 విధించారు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, సమావేశాలను నిర్వహించడంపై నిషేధం విధించారు. ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన టీడీపీ, వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇరు పార్టీల నిరసనలకు అనుమతిని నిరాకరించిన పోలీసులు హౌస్ అరెస్టులు చేసేందుకు యత్నిస్తున్నారు.
మరోవైపు ఉండవల్లిలోని టిడిపి అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చలో ఆత్మకూరుకు వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో చంద్రబాబు నిరాహారదీక్ష చేపట్టారు. సాయంత్రం 8 గంటల వరకు ఆయన నిరాహారదీక్ష కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలంతా ఎక్కడికక్కడ నిరసనలు తెలపారని ఆయన పిలుపునిచ్చారు. ఇదే సమయంలో నివాసంలోకి వెళ్లేందుకు యత్నించిన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నన్నపనేని రాజకుమారిలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పున్నమి గెస్ట్ హౌస్ కు తరలించారు.
చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, గద్దె రామ్మోహన్రావు, కృష్ణా జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడలో ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ప్రకాశం జిల్లాలో శిద్దా రాఘవరావు, అశోక్ రెడ్డిలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కృష్ణా జిల్లాలో టీడీపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తూ టీడీపీ ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చింది. దీనికి పోటీగా వైసీపీ కూడా ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని డీజీపీ చెప్పడంతో టీడీపీ నేతలు గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని కలిసి అనుమతి కోరారు. దీనికి ప్రతిగా వైసీపీ నేతలు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ను కలిసి అనుమతి కోరారు. టీడీపీ హయాంలో తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయడం వల్లే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వైసీపీ నేతలు తెలిపారు. దీంతో గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.