బీహార్: ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినందుకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం సహా 49 మంది సెలెబ్రిటీలపై బీహార్ లో కేసు నమోదైంది. మూడు నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అసహనం, కొట్టి చంపడాలు పెరిగిపోతున్నాయంటూ.. దర్శకుడు మణిరత్నం, చరిత్రకారుడు రామచంద్ర గుహ, అదూర్ గోపాల కృష్ణన్, అపర్ణాసేన్, అనురాగ్ కశ్యప్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ సహా మొత్తం 50 మంది సెలెబ్రిటీలు మోదీకి బహిరంగ లేఖ రాశారు. అయితే, ప్రధాని స్థాయి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చేందుకే 50 మంది సెలెబ్రిటీలు ప్రయత్నించారంటూ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా రెండు నెలల క్రితం బీహార్ లోని ముజఫర్ నగర్ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ..దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో సహా 50 మంది సెలెబ్రిటీలపై దేశద్రోహం నేరం కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు సెలెబ్రిటీలపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశామని ముజఫర్ నగర్ పోలీసులు తెలిపారు.
దేశంలోని మైనార్టీలు, దళితులపై జరుగుతున్న మూకదాడుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవాలని కోరుతూ 49 మంది ప్రముఖులు జులై 23న బహిరంగ లేఖ రాసిన విషయం విదితమే. అదూర్ గోపాల కృష్ణన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, అపర్ణాసేన్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, రామచంద్ర గుహ తదితరులు లేఖ రాసిన వారిలో ఉన్నారు. అప్పట్లో ఈ లేఖ సంచలనం సృష్టించింది. అయితే ఈ లేఖకు రాసిన రెండు రోజులకే దీనికి కౌంటర్గా అన్నట్టు వివిధ రంగాలకు చెందిన 62 మంది ప్రముఖులు మరో బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే.