అమరావతి : రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల సెలెక్ట్ కమిటీ కోసం టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పార్టీలు సోమవారం మండలి చైర్మన్ షరీఫ్ కు పేర్లు అందజేశాయి. ఈ సెలెక్ట్ కమిటీలో తాము ఉండమనీ, ఇది రాజ్యాంగ విరుద్ధమనీ, ఈ ప్రక్రియలో భాగస్వాములు కామనీ అధికార వైసీపీ నేత డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ లేఖలు రాశారు.
ఈ నేపథ్యంలో సెలెక్ట్ కమిటీ కోసం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, ప్రొగ్రసీవ్ డెమొక్రటీవ్ ఫ్రంట్ ఈ మూడు పార్టీలు శాసనమండలిలో సెలెక్ట్ కమిటీలకు తమ పేర్లను పంపాయి.
సీఆర్డీఏకు సంబంధించిన కమిటీలో దీపక్రెడ్డి, బీదా రవిచంద్ర, బచ్చుల అర్జునుడు, గౌరవాని శ్రీనివాసులు, బుద్దా నాగజగదీశ్వరరావు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు(మూడు రాజధానుల కోసం)కు నారా లోకేష్, అశోక్బాబు, తిప్పేస్వామి, బీటీ నాయుడు, గుమ్మడి సంధ్యారాణి పేర్లను టీడీపీ సెలెక్ట్ కమిటీకి పంపింది. బీజేపీ నుంచి వికేంద్రీకరణ బిల్లు కింద మాధవ్, సీఆర్డీయే రద్దు కమిటీకి సోము వీర్రాజు పేర్లను ఆ పార్టీ పంపింది. పీడీఎఫ్ నుంచి వికేంద్రీకరణ బిల్లుకు కేఎల్ లక్ష్మణరావు, సీఆర్డీయే రద్దు బిల్లుకు ఇళ్ల వెంకటేశ్వరరావు పేర్లను ఛైర్మన్కు పంపారు. బుధవారం ఈ కమిటీకి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.