(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
టీమిండియా సెలెక్టర్లపై భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు టీకప్పులు అందించడమే సెలెక్టర్ల పని అని ఆయన విమర్శించారు. యూకేలో జరిగిన 2019 ప్రపంచ కప్ మ్యాచ్ లో అనుష్క శర్మకు టీకప్పులు అందించడం తాను చూశానని చెప్పారు. ఎంఎస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పట్ల 82 ఏళ్ల ఫరూక్ ఇంజనీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ‘మిక్కీ మౌస్ సెలెక్షన్ కమిటీ’ అని ఆయన ఎద్దేవా చేశారు. సెలెక్షన్ కమిటీపై కోహ్లీ ప్రభావం ఎక్కువగా ఉందని అన్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పారు. అసలు ఈ సెలెక్టర్లను ఎలా ఎంపిక చేస్తున్నారో కూడా తనకు అర్థం కావడం లేదని ఫరూక్ పేర్కొన్నారు. 10 నుంచి 12 టెస్టు మ్యాచుల కంటే ఎక్కువ వీరెవరూ ఆడలేదని చెప్పారు. ఇటీవల జరిగిన ప్రపంచకప్ లో ఒక సెలెక్టర్ ను తాను కనీసం గుర్తు కూడా పట్టలేకపోయానని ఫరూక్ తెలిపారు. ఇండియా బ్లేజర్ వేసుకుని అతను ఉండటంతో… నీవు ఎవరని అడిగానని చెప్పారు. దీనికి సమాధానంగా తాను సెలెక్టర్ నని చెప్పాడని తెలిపారు. సెలెక్షన్ కమిటీలో దిలీప్ వెంగ్సర్కార్ ఉండాలని తాను భావిస్తున్నానని చెప్పారు. వెంగ్సర్కార్ స్థాయి ఉన్న వ్యక్తులు కమిటీలో ఉండాలని ఫరూక్ ఇంజినీర్ పేర్కొన్నారు.