(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: సస్పెన్షన్ కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు కేంద్ర ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమంటూ ట్రైబ్యునల్లో ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. ట్రైబ్యునల్ శుక్రవారం నాడు దీనిపై విచారణ జరపనున్నది. నిరాధార ఆరోపణలతో సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. గత ఏడాది మే 31 నుంచి తనకు పోస్టింగ్ ఇవ్వలేదనీ, వేతనం కూడా చెల్లించడం లేదని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వెంకటేశ్వరరావు పిటీషన్ ను కేంద్ర ట్రైబ్యునల్ స్వీకరించింది.
ఎబి ట్రైబ్యునల్ను ఆశ్రయించగానే ప్రభుత్వం స్పందించింది. ట్రైబ్యునల్లో కేసు వాదించేందుకు సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డిని నియమిస్తూ జిఎడి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.