హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సెక్రటేరియెట్ భవనాలను కూల్చకూడదని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత దీనిపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబరు 14కు వాయిదా వేసింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో పాత ప్రభుత్వ భవనాల కూల్చివేతపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ఆ సమయంలోనే సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది.
ఇటీవల అసెంబ్లీ కోసం ఎర్రమంజిల్ భవనం కూల్చివేత నిర్ణయంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ లోని పాత భవనాలను కూల్చొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మించొద్దని ఆదేశించింది. ఇప్పుడు సచివాలయ భవనాల కూల్చివేతపై స్టే విధించింది.