లక్నో: మైనర్ బాలికపై రెండేళ్ల క్రితం అత్యాచారం చేశాడన్న ఆభియోగంపై ఆ బిజెపి శాసనసభ్యుడు జైలులో ఉన్నాడు. జైలు నుంచే బాలిక కుటుంబాన్ని ఫోన్లో బెదిరిస్తున్నాడు. ఉన్నావ్ రేప్కేసుగా ప్రచారంలో ఉన్న ఈ కేసులోని బాధితురాలు ప్రయాణిస్తున్న కారును నిన్న లారీ ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలి పిన్నమ్మలు ఇద్దరు మరణించారు. వారిలో ఒకరి భర్త జైలులో ఉన్నాడు. అతనిని చూసేందుకు జైలుకు వెళుతున్నప్పుడే కారును లారీ ఢీకొన్నది. జైలు నుంచే ఈ బిజెపి ఎమ్మెల్యే కులదీప్ సెనగర్ బెదిరిస్తున్న విషయం ఇప్పుడు బయటకువచ్చింది.
లారీ వచ్చి ఢీకొనడం సెనగర్ పనేనని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సెనగర్పై, మరో 11 మందిపై హత్య, హత్యాప్రయత్నం అభియోగలతో కేసు పెట్టారు. మొదట అత్యాచారం సంగతి ఫిర్యాదు చేసేందుకు వెళ్లినపుడే పోలీసులు సెనగర్తో రాజీ పడమని చెప్పారని బాలిక పినతండ్రి దాఖలు చేసిన ఫిర్యాదులోపేర్కొన్నారు.
బాధితారాలి భద్రత కోసం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు సిబ్బంది ఎదురుగానే జైలులో ఉన్న సెనగర్నుంచి వారికి బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని పోలీసులు చివరికి ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. బాధితురాలి కదలికలు ఆమె భద్రతా సిబ్బంది ద్వారానే సెనగర్కు తెలిశాయి. ఫలితంగా కారును లారీతో ఢీకొట్టించగలిగాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మొదట ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇది మామూలు ప్రమాదంలానే కనబడుతుందని అన్నారు. తర్వాత హత్యకేసుగా మార్చారు. ఆదిత్యనాధ్ ప్రభుత్వం సోమవారం రాత్రి ఈ కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించింది.