ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్పై వచ్చిన లైంగికవేధింపుల ఆరోపణల్లో ఏటువంటి వాస్తవం లేదని త్రిసభ్య కమిటీ తేల్చింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్పై సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలపై విచారణ నిర్వహించేందుకు జస్టిస్ బొబ్డే, ఎన్వి రమణ, ఇందిరా బెనర్జీలతో సుప్రీం ప్యానల్ ఏర్పాటు చేయగా జస్టిస్ ఎన్ వి రమణ సిజెఐకి అత్యంత సన్నిహితుడని ఫిర్యాదిదారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో త్రిసభ్య ప్యానల్ నుండి ఎన్వి రమణ స్వచ్చందగా తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో జస్టిస్ ఇందు మల్హోత్రాని సభ్యురాలిగా చేర్చారు. ఈ కమిటీ ముందు బాధిత మహిళ రెండు సార్లు విచారణకు హజరయ్యింది. తర్వాత తాను ఇకమీదట కమిటీ ముందు హాజరు కాబోనని ఆమె ప్రకటించింది. కమిటీలో వాతావరణం భయపెట్టేలా ఉందనీ, తన న్యాయవాది లేకుండా ముగ్గురు సుప్రీం న్యాయమూర్తుల ప్రశ్నలు ఎదుర్కొవడం చాలా కష్టంగా అనిపిస్తుందని ఆమె ఒక ప్రకటినలో తెలిపింది. తాను కోరినట్లు బయటి వ్యక్తులతో కమిటీ కాకుండా సిజెఐ జూనియర్లు అయిన సిట్టింగ్ జడ్జిల కమిటీతో తనకు న్యాయం జరుగుతుందని భావించడం లేదనీ, విచారణకు హజరు కాబోనని ప్రకటించింది. కాగా భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ త్రిసభ్య ప్యానల్ ముందు హజరయ్యారు.
బాధితురాలు విచారణకు హజరుకాబోనని ప్రకటించిన నేపథ్యంలో జస్టిస్ బొబ్డేకి మరో సుప్రీం న్యాయమూర్తి డివై చంద్రచూడ్ విచారణ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. బాధితురాలిని విచారించే సమయంలో ఆమె తరపు న్యాయవాది ఉండటాన్ని తిరస్కరించడం స్వేచ్చాయుత విచారణను ఉల్లంఘించడమే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. తన వాంగ్యూలం కాపీ ఇవ్వాలని పిర్యాదుదారు మహిళ కోరినప్పుడు దాన్ని విచారణ కమిటీ నిరాకరించడానికి వీల్లేదని కూడా లేఖలో చెప్పారు. కనీసం ఎమికస్ క్యూరీని నియమించాలని ఆయన కోరారు. కమిటీకి సహకరించేందుకు బార్ నుండి ఒక సినియర్ మహిళా న్యాయవాదిని సూచించారు. విచారణ జరిపిన సుప్రీం త్రిసభ్య ప్యానల్ చివరికి మహిళ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నిర్ధారణకు వచ్చారు.