విజయవాడ: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన చలో విజయవాడ ఉద్రిక్తంగా మారింది. ధర్నాలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ నేతలను పోలీసు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ధర్నా చౌక్ వరకూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. 13 జిల్లాల నుండి వందలాదిగా విద్యార్థులు హజరయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. మూడు రోజుల లోపు వీటిపై స్పష్టమైన ప్రకటనను ప్రభుత్వం చేయకుంటే విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా వ్యాన్లో ఎక్కించి సత్యనారాయపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే విద్యార్థులు అని కూడా చూడకుండా లాఠీలతో కొట్టి పోలీస్ స్టేషన్ సెల్లో వేస్తారా అంటూ విద్యార్థి సంఘ నేతలు నిలదీస్తున్నారు.